
తల్లీబిడ్డ వాహనాల డ్రైవర్లు నిరసన
నరసరావుపేట: తల్లీబిడ్డ ఎక్స్్ప్రెస్ డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద శుక్రవారంనిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎం.సాంబశివరావు మాట్లాడుతూ ఏడేళ్ల నుంచి నెలకు జీతం రూ.8800 మాత్రమే ఇస్తున్నారని, పీఎఫ్ వాటా కూడా డ్రైవర్ల వేతనాల నుంచి మినహాయిస్తున్నారని తెలిపారు. తమను కూడా ఆప్కాస్లో చేర్చి కనీస వేతనాలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని పలువురు డ్రైవర్లు కోరారు. సీఐటీయూ మండల కార్యదర్శి షేక్ సిలార్ రసూల్ మాట్లాడుతూ బాలింతను వాహనంలో ఎక్కించుకున్నప్పుడు, ఆమెను ఇంటి దగ్గర దించాక యాప్ ద్వారా ఫొటో అప్లోడ్ చేసే క్రమంలో అది సక్రమంగా పనిచేయక డ్రైవర్లు పని ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. వారాంతపు, పండుగ సెలవులు, ఇంక్రిమెంట్లు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాల్ని చట్టప్రకారం అమలు చేయాలని కోరారు. సిబ్బందిని ఏజెన్సీ ద్వారా నియమించినా ప్రభుత్వం వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో పని చేస్తున్నట్లు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టరేట్లో ఏఓ లీలాకుమారికి వినతిపత్రం అందజేశారు. వాహనాల సంఖ్యను బట్టి అదనపు, బఫర్ సిబ్బందిని నియమించాలని కోరారు. ఖాళీలను వెంటనే భర్తీ చేసి, సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ కలెక్టరేట్లో వినతిపత్రం అందజేత