
యానిమేషన్ షాక్ !
తన వద్ద ఉన్నది రూ.2.72 కోట్లేనట..!
నరసరావుపేటటౌన్: యానిమేషన్ బాధితులకు నిర్వహకుడు కిరణ్ షాక్ ఇచ్చాడు. అధిక వడ్డీ ఆశచూపి పెట్టుబడిదారుల వద్ద నుంచి రూ.కోట్లు వసూలు చేసిన యూపిక్స్ అధినేత కిరణ్ నెలరోజుల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం విధితమే. రూ.కోట్లు చెల్లించిన బాధితుల్లో ఒకరు నరసరావుపేటకు చెందిన వ్యాపారి గుండా నాగేశ్వరరావు మనోవేదన చెంది వారం క్రితం గుండె పోటుతో మృతి చెందాడు. మరికొందరు బాధితులు చెల్లించిన డబ్బులు తిరిగి వస్తాయో లేవోనన్న ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో యానిమేషన్ నిర్వహకుడు తాను దివాళా తీసినట్టు నోటీసులు పంపించాడు. సుమారు 102 మంది పెట్టుబడిదారులకు రూ.156 కోట్లకు ఐపీ దాఖలు చేస్తూ తన న్యాయవాది ద్వారా బాఽధితులకు గురువారం నోటీసులు అందించాడు. దీంతో బాధితులకు కోలుకోలేని దెబ్బ తగిలింది.
పేట వాసులే అధికం...
యానిమేషన్ స్కాం బాఽధితులను పరిశీలిస్తే నరసరావుపేటకు చెందిన వారే అధికంగా ఉన్నారు. రూ.156 కోట్లలో 70 శాతం సొమ్ము నరసరావుపేట వాసులదే. నమ్మకంగా వ్యాపారం చేస్తూ అధిక వడ్డీ ఆశచూపడంతో స్తోమతకు మించి పెట్టుబడులు పెట్టారు. కొంతమంది ఉన్న ఆస్తులను సైతం విక్రయించగా, మరికొంతమంది వడ్డీలకు తెచ్చి మరి పెట్టుబడులు పెట్టారు. ఉన్న ఆస్తులు విక్రయించినా అప్పులు చెల్లించలేని పరిస్థితుల్లో కొందరు కొట్టుమిట్టాడుతున్నారు. పెట్టుబడిదారులు తెచ్చిన డబ్బులకు వడ్డీలు చెల్లిస్తూ కాలయాపన చేస్తున్నారు. కిరణ్ ఐపీతో ఇక డబ్బులు రావని తెలుసుకున్న అప్పులిచ్చిన వారు బాధితులపై ఒత్తిడి తెస్తున్నారు.
ఐపీలో చూపిందే కొంతే...
యానిమేషన్ స్కాం మొత్తం రూ.1,000 కోట్ల పై చిలుకు ఉంటుందని బాధితులు చెప్పుకొస్తున్నారు. ఒక్క నరసరావుపేటలోనే 200 మందికి పైగా బాధితులుండగా వారి నుంచి సుమారు రూ.400 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో అనేకమంది బాధితులు డిపాజిట్లు చేశారు. విజయవాడ, హైదరాబాద్ కేంద్రంగా కార్యాలయాలను ఏర్పాటు చేసి మధ్యవర్తుల ద్వారా రూ.కోట్లలో పెట్టుబడులను కిరణ్ స్వీకరించారు. ఐతే అకౌంట్లలో జమ అయిన మొత్తానికి మాత్రమే ఐపీలో చూపించాడు. లెక్కల్లో చూపని డబ్బు(బ్లాక్ మనీ) ఐపీ నోటీసులో చూపించలేదని కొంతమంది బాధితులు చెప్పుకొస్తున్నారు. ఏడు నెలలుగా చెల్లింపులు మొత్తం పూర్తిగా నిలిపివేశాడు. అయినప్పటికీ అమెరికాలో నూతన ప్రాజెక్టు వచ్చిందని సన్మానాలు చేయించుకొని పెట్టుబడిదారులను ఆకర్షించాడు. అధిక వడ్డీ ఆశచూపించి నాలుగైదు నెలల వ్యవధిలో రూ.కోట్లు వసూలు చేశాడు. చివరకు బోర్డు తిప్పేశాడు.
ఐపీ దాఖలు చేసిన యూపిక్స్ యానిమేషన్ అధినేత రూ.156 కోట్లకు దివాలా తీసినట్టు 102 మందికి నోటీసులు బాధితుల్లో అధిక శాతం నరసరావుపేట వాసులే రెండు తెలుగురాష్ట్రాల్లో రూ.1,000 కోట్లకు పైగా స్కాం బాధితులు పెట్టిన బ్లాక్మనీని ఐపీలో చూపని కిరణ్
పెట్టుబడి పెడితే ఏడాదిలో రూపాయికి రూపాయి ఇస్తానని నమ్మించిన కిరణ్ ఏడు నెలలుగా డిపాజిట్దారులకు డబ్బు చెల్లించకపోవడంతో ఒత్తిడి తెచ్చారు. అజ్ఞాతంలోకి వెళ్లిన కిరణ్ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఇందులో అందరికీ త్వరలోనే డబ్బులు చెల్లిస్తానని ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ హామీ ఇచ్చాడు. దీంతో పాటు కొందరి ఫోన్లకు స్పందించి మాయమాటలు చెప్పాడు. త్వరలోనే పెద్ద మొత్తంలో నగదు వస్తుందని అనుకున్నదానికంటే కూడా ఎక్కువ మొత్తంలో తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలికాడు. అతని మాటలతో బాధితులు పోలీసు స్టేషన్లకు వెళ్లేందుకు సైతం వెనుకాడారు. పోలీసులకు ఫిర్యాదుచేస్తే ఆవంక చూపి తమ డబ్బులు ఇవ్వడేమోనని మిన్నుకుండిపోయారు. ఈ సమయంలో కిరణ్ షాక్ ఇచ్చేవిధంగా ఐపీ నోటీసులు పంపాడు.
అనుకున్నంత అయ్యింది.. ఎన్నో ఆశలతో, మరెన్నో ఊహలతో పెట్టుబడులు పెట్టిన వందల మంది గుండెలు ముక్కలయ్యాయి. యానిమేషన్ మాయ చేసి రంగుల ప్రపంచం చూపించిన కిరణ్ తాను తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేనంటూ ఐపీ పెట్టేశాడు. రూపాయి రూపాయి కూడబెట్టి, ఆశల అప్పులు మూటకట్టుకొని ఈ యానిమేషన్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వందల మంది ఏం చేయాలో దిక్కుతోచక ఒంటరిగా మిగిలారు. కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగదంటూ తమకు దిక్కెవరంటూ బాధితుల గుండెలు బాదుకుంటూ రోదిస్తున్నారు.
రూ.156 కోట్లకు ఐపీ దాఖలు చేసిన కిరణ్ తన వద్ద సుమారు రూ.2.72 కోట్ల విలువైన వస్తువులే ఉన్నట్టు ఐపీలో చూపించాడు. ఈ వ్యవహారం చూస్తుంటే ముందుగానే ఐపీ పెట్టేందుకు ప్రణాళిక రచించినట్టు అర్థమవుతోంది. యూపిక్స్ యానిమేషన్ కార్యాలయాల్లో ఉన్న కంప్యూటర్లు, ఫ్యాన్లు, టీవీలు, సీలు, ఇతర ఫర్నీచర్ ఆస్తిగా చూపించాడు. ఇందులో 70 కంప్యూటర్ల విలువ రూ.2.5 కోట్లుగా చూపించడం కొసమెరుపు.

యానిమేషన్ షాక్ !