
బాల్యం నుంచే క్రీడాస్ఫూర్తి అలవరుచుకోవాలి
నరసరావుపేట ఈస్ట్: జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను అధిగమించి ఉన్నతంగా ఎదిగేందుకు క్రీడా స్ఫూర్తి దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు తెలిపారు. సత్తెనపల్లిరోడ్డులోని డీఎస్ఏ స్టేడియంలో గురువారం పల్నాడుజిల్లా వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో కలసి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ అరుణ్బాబు మాట్లాడుతూ, ఆటల్లో గెలుపు, ఓటములు సహజమని, ఓటమిని విజయానికి మెట్టుగా చేసుకొని విజయం సాధించాలని తెలిపారు. చిన్నతనం నుంచే క్రీడా స్ఫూర్తిని అలవరచుకోవటం ద్వారా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని వివరించారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ప్రారంభించిన అనంతరం కలెక్టర్ అరుణ్బాబు, ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబు కొద్దిసేపు చిన్నారులతో కలసి బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, క్రికెట్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో 18 క్రీడాంశాలలో 50 క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. శిక్షణ అనంతరం శిబిరంలో పాల్గొన్న బాల బాలికలకు క్రీడా ధ్రువీకరణ పత్రాలు అందిస్తామన్నారు. ఆయా క్రీడాంశాల కోచ్లు, పీఈటీలు, పీడీలు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్