
ఆత్మహత్యలే శరణ్యం!
సత్తెనపల్లి: తమకు న్యాయం చేయాలంటూ పురుగు మందు డబ్బాలతో మిర్చి రైతులు రోడ్డెక్కిన సంఘటన సత్తెనపల్లిలో మంగళవారం జరిగింది. సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన మిర్చి వ్యాపారి రావిపూడి తిరుమలరావు లక్కరాజు గార్లపాడు గ్రామంతో పాటు చుట్టుపక్కల రైతులను నుంచి పెద్దఎత్తున మిర్చిని కొనుగోలు చేశాడు. అయితే నగదు చెల్లించకుండా కొద్ది రోజుల క్రితం పరారయ్యాడు. చివరకు లక్కరాజుగార్లపాడు గ్రామానికి చెందిన రైతులు ఆ వ్యాపారిని పట్టుకొచ్చి పోలీసులకు అప్పగించారు. ఈ నెల 8న గ్రామానికి చెందిన 13 మంది రైతులు తమ వద్ద 381 క్వింటాళ్లు మిర్చిని కొనుగోలు చేశాడని, వాటి నిమిత్తం రూ.41.30 లక్షలు ఇవ్వాలని ఫిర్యాదు చేశారు. ఇంకా చాలామంది రైతులు నుంచి మిర్చి కొనుగోలు చేసినట్లు సమాచారం. వ్యాపారిపై కేసు నమోదు చేసి పోలీసులు కోర్టుకు హాజరు పరచగా రిమాండ్ విధించారు. ఈ నెల 26న బెయిలుపై విడుదలయ్యాడు. కానీ ఇంతవరకు రైతులకు న్యాయం జరగకపోవడంతో తమకు ఆత్మహత్యేలు శరణ్యం అంటూ పురుగుమందు డబ్బాలతో సత్తెనపల్లిలోని గుంటూరు – మాచర్ల ప్రధాన రహదారిపై మంగళవారం బైఠాయించారు.
ఈ ఏడాది మిర్చి సాగు చేసిన తమ పరిస్థితి అసలే దయనీయంగా మారిందని, మిర్చిని కొనుగోలు చేసి నగదు ఇవ్వకుండా వ్యాపారి ఇబ్బందులు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తమకు చావు తప్ప మరో మార్గం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పురుగు మందు డబ్బాలు ఓపెన్ చేసి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు ప్రతిన బూనడంతో పోలీసులు బలవంతంగా రైతుల వద్ద నుంచి పురుగుమందు డబ్బాలు లాక్కున్నారు. సత్తెనపల్లి టౌన్ సీఐ ఎన్.నాగమల్లేశ్వరరావు, సత్తెనపల్లి రూరల్ ఎస్ఐ అమీనుద్దీన్, పోలీసులు పురుగుమందు డబ్బాలు లాక్కొని రైతులకు సర్ది చెప్పడంతో రైతులు ఆందోళనను విరమించారు.
పురుగుమందు డబ్బాలతో రోడ్డెక్కిన మిర్చి రైతులు సత్తెనపల్లిలో గుంటూరు – మాచర్ల రహదారిపై టెన్షన్.. టెన్షన్ పోలీసుల జోక్యతో ఆందోళన విరమణ

ఆత్మహత్యలే శరణ్యం!