
కష్టపడే తత్వంతో ఉన్నత స్థానాలకు..
నరసరావుపేట: పల్నాడు జిల్లా వెనుకబడిన ప్రాంతమైనప్పటికీ పిల్లలో కష్టపడే తత్వం గుర్తించడం జరిగిందని, అదివారి మంచి భవిష్యత్తుకు దారి తీస్తుందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు పేర్కొన్నారు. మంగళవారం భువనచంద్ర టౌన్హాలులో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇటీవల ప్రకటించిన పదోతరగతి ఫలితాల్లో 580 మార్కులకు పైబడి సాధించిన 92 మంది విద్యార్థుల అభినందన సభ నిర్వహించారు. విశిష్ట అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో పదోతరగతి ఉత్తీర్ణత శాతం 95శాతం నిర్ణయిస్తే, 85 శాతం లభించిందని అన్నారు. కారెంపూడిలో మండలంలో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ప్రభుత్వ చీఫ్విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం అభినందనీయమని చెప్పారు. అత్యధిక మార్కులు సాధించి, జిల్లాలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు శివశక్తి ఫౌండేషన్ తరఫున నగదు బహుమతి అందజేశారు. మొదటి రెండు స్థానాలవారికి రూ.25వేలు, తృతీయస్థానం సాధించిన విద్యార్థికి రూ.15వేల నగదును అందచేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తమ విద్యాసంస్థలో 580 మార్కులు వచ్చిన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తామన్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్బాబు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడారు. అనంతరం మొదటి స్థానం సాధించిన పావని చంద్రిక, ద్వితీయస్థానం సాధించిన షేక్ సమీరాలకు ఎమ్మెల్యే జూలకంటి తన సొంత నిధులు రూ. లక్ష చొప్పున, తృతీయస్థానం సాధించిన ప్రత్తిపాటి అమూల్యకు రూ.50వేల నగదు అందజేశారు. డీఈఓ ఎల్.చంద్రకళ, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, బులియన్ మర్చంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, ఎంఈఓలు, హెచ్ఎంలు పాల్గొన్నారు.

కష్టపడే తత్వంతో ఉన్నత స్థానాలకు..