నోటిఫికేషన్ కోసం ఎన్నాళ్లగానో 30వేల మంది అభ్యర్థుల నిరీక్షణ
మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
మే 20 నుంచి మాక్ టెస్ట్లు జూన్ 6 నుంచి జూలై ఆరు వరకు పరీక్షలు
సన్నద్ధతకు 45 రోజులే వ్యవధి ప్రిపరేషన్కు కనీసం 90 రోజులు అవసరమంటున్న సబ్జెక్టు నిపుణులు.
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు విడుదల చేసిన డీఎస్సీ–2025 షెడ్యూల్ అభ్యర్థులకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ మొదలు జూన్ ఆరో తేదీన పరీక్షల ప్రారంభానికి మధ్యలో 45 రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో అంత తక్కువ కాలంలో పరీక్షలకు సన్నద్ధం కావడం సాధ్యమేనా ? అని అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తోందనిసంతోషించాలో, సన్నద్ధమయ్యేందుకు కనీసం గడువు ఇవ్వకుండా హడావుడిగా షెడ్యూల్ జారీ చేసినందుకు బాధపడాలో తెలియని ఆయోమయ పరిస్థితుల్లో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1,143 పోస్టులు
డీఎస్సీ–2025 ద్వారా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1,143 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 622, ఎస్జీటీ 521 ఉన్నాయి. వీటితో పాటు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మరో 16 పోస్టులు భర్తీ చేయనున్నట్లుగా చూపారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో సబ్జెక్టుల వారీగా తెలుగు 42, హిందీ 57, ఇంగ్లీషు 69, మాధ్స్ 35, ఫిజికల్ సైన్స్ 58, బయాలాజికల్ సైన్స్ 86, సోషల్ 109, ఫిజికల్ ఎడ్యుకేషన్ 166తో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 521 ఉన్నాయి.
మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
డీఎస్సీ–2025కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు గడువు ఇచ్చారు. మే 20 నుంచి మాక్టెస్ట్లు జరగనున్నాయి. మే 30 నుంచి హాల్ టిక్కెట్లు డోన్లోడింగ్, జూన్ 6వ తేదీ నుంచి జూలై ఆరు వరకు ఆయా కేటగిరీల వారీగా పరీక్షలు జరగున్నాయి. పరీక్షల నిర్వహణ అనంతరం ప్రాధమిక కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ, తుది కీ విడుదల చేసి, మెరిట్ ప్రకటించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్లో పొందుపర్చారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇలా..
భర్తీ చేయనున్న పోస్టులు : 1,143
ఎస్జీటీ పోస్టులు: 521
45 రోజులు సరిపోవు
ఏడేళ్ల అనంతరం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు 45 రోజుల సమయం సరిపోదని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సబ్జెక్టు నిపుణులూ అదే విషయం చెబుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో డీఎస్సీ కోసం 30వేల మంది వరకు అభ్యర్థులు ఎన్నాళ్ల నుంచో నిరీక్షిస్తున్నారు. వీరిలో చాలా మంది వయోపరిమితి పూర్తయిపోతోంది. ఈ నేపథ్యంలో వయో పరిమితిని పెంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.
90 రోజుల వ్యవధి అవసరం
డీఎస్సీ దరఖాస్తు గడువు, పరీక్షలకు మధ్య వ్యవధి చాలా తక్కువ ఉంది. విస్తృత సిలబస్ను పూర్తి చేసేందుకు 45 రోజులు సరిపోవు. విద్యాశాఖ హడావుడిగా షెడ్యూల్ ఖరారు చేసింది. కనీసం 90 రోజుల వ్యవధి అవసరం. అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్ల నుంచి 47 ఏళ్లకు పెంచాలి. 2018 తరువాత చేపడుతున్న డీఎస్సీ కావడంతో వేలాది మంది అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. తెలంగాణలో 46ఏళ్లకు వయోపరిమితి పెంచారు. రాష్ట్రంలో 47ఏళ్లకు పెంచాలి.
– కేఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ

సన్నద్ధకు సమయమేదీ?

కేఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ