● కాలంతో పోరాటం.. పూర్వవైభవానికై ఆరాటం ● ఆధునికతను ఆహ్వానిస్తూ.. ప్రయోగాలతో పయనిస్తూ.. ● ఈనెల 27న ప్రపంచ నాటక దినోత్సవం
యడ్లపాడు: ప్రేమ, దుఃఖం, ఆశ, నిరాశ, విజయం, ఓటమి ఈ జీవన ఘట్టాలన్నింటినీ ఒకే వేదికపై ఆవిష్కరించే మహత్తర మాధ్యమం నాటకం. ప్రేక్షకుని మనస్సును హత్తుకునే హావభావాలు, ఆలోచనలను కదిలించే సంభాషణలు, సమాజాన్ని శుద్ధి చేసే కథావస్తువు, ఒక్క ప్రదర్శనలోనే గుండెల్ని కొల్లగొట్టే నిజజీవిత అనుభవం. ఇవన్నీ నాటక కళను విశిష్టంగా నిలబెడతాయి.
కావ్యేషు నాటకం రమ్యం..
భరతముని రచించిన ‘నాట్యశాస్త్రం’ నుంచి నేటి సాంకేతిక నాటక ప్రదర్శనల వరకు ఈ రంగం ఎన్నో మార్పులను స్వీకరించింది. రాజసభల నుంచి వీధి ప్రదర్శనల వరకు విస్తరించి, యక్షగానం, కూచిపూడి, భవాయి, ఒగ్గుకథల రూపంలో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశభక్తి ప్రచార సాధనంగా మారింది. పాశ్చాత్య ప్రభావంతో ఆధునిక రంగస్థల నాటకాలు ఆవిష్కృతమయ్యాయి. నయా థియేటర్లు, కొత్త కథావస్తువులు రంగ ప్రవేశం చేశాయి. ప్రయోగాత్మక ప్రదర్శనలు వెలుగులోకి వచ్చాయి. పౌరాణిక, జానపద, సాంఘికంగా రూపాంతరం చెందాయి. భారతీయ కళలు 64 ఉన్నప్పటికీ ‘కావ్యేషు నాటకం రమ్యం’ అనే రమణీయ ఆర్యోక్తితో అగ్రస్థానంలో నిలిచింది.
అన్నింటికీ మూలం అదే..
టీవీ, సినిమా, వెబ్ సిరీస్, షార్ట్ఫిల్మ్, యాడ్స్, లైవ్షోస్, సినిమాలు వంటివి ఎన్ని వచ్చినా వాటికి మూలమైన నాటకం తన జీవాన్ని కోల్పోలేదు. ఎందుకంటే తెర వెనుక నటించిన నటుడిని మనం చూసే అవకాశం లేదు, కానీ రంగస్థలం మీద తడిసిముద్దయిన భావోద్వేగాలను ప్రత్యక్షంగా అనుభవించగలగే గంభీరత నాటక కళకు మాత్రమే సాధ్యం. డిజిటల్ ప్రొజెక్షన్స్, మల్టీమీడియా ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్, 3డీ లైట్ టెక్నాలజీ వంటి విభిన్న ప్రయోగాలతో నాటకం జవసత్వాలను తెచ్చుకుంటుంది. పరిషత్లు సైతం ప్రేక్షకుల్ని వేదిక వద్దకు తెచ్చేలా తమవంతు ప్రయత్నం చేస్తున్నాయి. ఎప్పుడో 1961 మార్చి 27న ప్రారంభమైన అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం, నాలుగేళ్ల కిందటే షష్టిపూర్తి చేసుకుంది.