యడ్లపాడు: రోడ్డు ప్రమాదంలో యడ్లపాడు మండలం వంకాయలపాడుకు చెందిన వ్యక్తి మృత్యువాత పడిన ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాలు.. మండలంలోని వంకాయలపాడుకు చెందిన లారీ డ్రైవర్ షేక్ మస్తాన్వలి(62) మూడు రోజుల కిందట వైజాగ్కు లోడు తీసుకుని వెళ్లాడు. వైజాగ్ నుంచి ఐరన్ లోడ్తో తిరుగు ప్రయాణంలో ఉన్న లారీ, శుక్రవారం అర్ధరాత్రి అనకాపల్లిలో మరో లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసం కాగా, మస్తాన్వలి నడిపే లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జ కావడంతో మస్తాన్వలి డ్రైవర్ సీట్లోనే ఇరక్కుపోయాడు. అక్కడిక్కడే మృతి చెందాడు. ఏడాదిన్నర క్రితం భార్యను కోల్పోయిన మస్తానన్వలి, ఇద్దరు సంతానంలో ఒక కుమార్తె కూడా కొద్దికాలం కిందట మృతి చెందింది. ప్రస్తుతం మరో కుమార్తె, అల్లుడు వంకాయపాడు గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. డ్యూటీకి అని వెళ్లిన తన తండ్రి విగతజీవిగా మారాడన్న వార్త విన్న కుమార్తె కన్నీరు మున్నీరుగా విలపించింది.
కృష్ణానదిలో పడి వ్యక్తి మృతి
అచ్చంపేట: కృష్ణానదిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని కోగంటివారిపాలెంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు మండలంలోని ఓర్వకల్లు గ్రామానికి చెందిన కోట జయరావు, సరోజినీల కుమారుడు రామ్కుమార్ (28) తన స్నేహితులతో కలసి శనివారం సాయంత్రం 5గంటల సమయంలో సమీపంలోని కృష్ణానదిలో సరదాగా ఈతకొట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే నది లోతుల్లో జారి పడిపోయినట్లు తెలిసింది. స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని గ్రామస్తులు తెలుపుతున్నారు. రామ్కుమార్ ఇటీవలనే వైద్యునిగా అర్హతపొంది గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో అసిస్టెంట్ వైద్యునిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. కుమారుడు అకస్మాతుగా మృతి చెందడంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. పోలీసుస్టేషన్లో ఎవ్వరూ ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.
చెట్టును ఢీకొట్టిన బైక్.. వ్యక్తి మృతి
మాచవరం: ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని గంగిరెడ్డిపాలెంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన నంద్యాల శివయ్య(65) వ్యక్తిగత పనులు ముగించుకొని బ్రాహ్మణపల్లి వైపు నుంచి గంగిరెడ్డిపాలెం వస్తుండగా ద్విచక్ర వాహనం టైరు పంక్చర్ కావడంతో బైక్ అదుపు తప్పి, రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో శివయ్య ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరు రౌడీషీటర్లపై పీడీ యాక్టు
ఎమ్మెల్యే ఒత్తిడితోనే అంటున్న కుటుంబ సభ్యులు
పట్నంబజారు: గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ పాతగుంటూరు పోలీసుస్టేషన్ పరిధిలో ఇద్దరు రౌడీషీటర్లపై పీడీ యాక్టు నమోదయింది. పాతగుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ కాలనీకి చెందిన టీడీపీ నాయకులు సయ్యద్ ఇంతియాజ్, సయ్యద్ ఫిరోజ్లు అన్నదమ్ములు. వీరిపై గత ఎనిమిది సంవత్సరాలుగా రౌడీషీట్ ఉంది. ఈక్రమంలో గత కొద్దిరోజుల క్రితం ఆర్టీసీ కాలనీలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన తూర్పు ఎమ్మెల్యే ఎండీ నసీర్ అహ్మద్కు వీరికి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్పై వీరు దాడికి యత్నించారు. గతంలో నుంచే టీడీపీలో నసీర్ అహ్మద్, ఇంతియాజ్ కుటుంబీకుల మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు ఇంతియాజ్, ఫిరోజ్ల సోదరుడు ముజీబ్ కూడా టీడీపీ తూర్పు నియోజకవర్గ సీటును ఆశించి భంగపడ్డారు. దీంతో వీరిమధ్య వివాదాలు మరింత ముదిరాయి. వివాదం విషయాన్ని మనసులో పెట్టుకున్న ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఉద్దేశ్యపూర్వకంగా వీరిపై పీడీ యాక్టు పెట్టించారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందు నుంచి అదును కోసం ఎదురు చూస్తున్న ఎమ్మెల్యే వీరికి ఉన్న రౌడీషీట్లను అడ్డుపెట్టుకుని ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశ్యంతో పీడీ యాక్టుతో పావులు కదిపారనే ఆరోపణలు లేకపోలేదు. పీడీ యాక్టు నమోదైన ఇంతియాజ్, ఫిరోజ్లను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వెళ్లిన నేపధ్యంలో వారు పరారీలో ఉన్నారని తెలిసింది. ఈ నేపధ్యంలో వారు టీడీపీ అగ్ర నాయకత్వాన్ని కలిసి విషయాన్ని వారికి దృష్టికి తీసుకుని వెళ్లనున్నట్లుసమాచారం.
సంప్రదాయ కళల పునర్వైభవానికి కృషి చేయాలి
కేంద్ర సంగీత, నాటక అకాడమీ సభ్యుడు డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి
గుంటూరు ఎడ్యుకేషన్: భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళల పునర్వైభవానికి కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర సంగీత, నాటక అకాడమీ సభ్యుడు డాక్టర్ వేదాంతం రామలింగశాస్త్రి అన్నారు. శనివారం కలెక్టర్ బంగ్లారోడ్డులోని భారతీయ విద్యాభవన్లో ఏర్పాటు చేసిన భవన్స్ కల్చరల్ అండ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. డాక్టర్ రామలింగశాస్త్రి మాట్లాడుతూ ఆధునిక యాంత్రిక జీవనంలో మన పురాతన కళలైన సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటివి కనుమరుగవుతున్నాయన్నారు. ఇటువంటి తరుణంలో భారతీయ విద్యా భవన్స్ ముందుకు వచ్చి సంస్కృతి, లలిత కళల అకాడమీని ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ప్రతి విద్యార్థి బాల్యం నుంచే సంగీతం, నాట్యం, సాహిత్యం, గానం, చిత్ర లేఖనంవంటి కళలు నేర్చుకొని అద్భుత ప్రతిభావంతులుగా రాణించాలన్నారు. ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ లలిత కళలు మన భారత జీవన గమనంలో భాగమని, పాశ్చాత్య దేశాలు పుట్టక మునుపే మన దేశంలో నలంద, తక్షశిలా వంటి విశ్వవిద్యాలయాల్లో సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటి అనేక కళల్లో శిక్షణా తరగతులను నిర్వహించి, భావితరాలకు అద్భుత కళారూపాలను అందించారని తెలిపారు. భారతీయ విద్యా భవన్స్ కార్యదర్శి పి.రామచంద్ర రాజు మాట్లాడుతూ అనేకమంది ప్రఖ్యాత కళాకారులకు జన్మభూమి అయిన గుంటూరులో అకాడమీను స్థాపించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వేదాంతం రామలింగేశ్వర శాస్త్రి చేతులమీదుగా అకాడమీ లోగోని ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ సంగీత నాటక పాఠశాల ప్రిన్సిపాల్ మార్టూరు హరిబాబు, శ్రీసాయి మంజీరా ఆర్ట్ అకాడమీ కార్యదర్శి కాజా వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, గాయత్రి మహిళా సంగీత సన్మండలి ప్రధాన కార్యదర్శి శేషు రాణిని సన్మానించారు. సాహితీ సమాఖ్య కన్వీనర్ ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, భారతీయ విద్యా భవన్ కోశాధికారి రామ్ సుభాష్, హిందూ కళాశాల తెలుగు విభాగాధిపతి ఎల్లాప్రగడ మల్లికార్జునరావు, ప్రిన్సిపాల్ హేమాంబ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి