నరసరావుపేట: జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రాధాన్యత అంశాల నివేదికలను తక్షణం సమర్పించాలని కలెక్టర్ పి.అరుణ్బాబు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లతో నిర్వహించనున్న కాన్ఫరెన్స్ సందర్భంగా శనివారం ఆయన కార్యాలయంలో అన్ని విభాగాల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు సంబంధించిన ప్రగతి, ప్రధాన సమస్యలను సీఎంకు వివరించేందుకు అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేయాలన్నారు. రాబోయే మూడు నెలల్లో అన్ని శాఖల పరంగా నిర్వహించాల్సిన ముఖ్యమైన కార్యాచరణ ప్రణాళికలను అందించాలన్నారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్కు ఎదురుగా ఉన్న మార్కెట్ యార్డులోని గోడౌన్లలో భద్రపరిచిన ఈవీఎంలను జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు శనివారం తనిఖీ చేశారు. డీఆర్వో ఏకా మురళి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
భావితరాలకు నీటిని అందించాలి
నరసరావుపేట రూరల్: మన జీవనాధారమైన నీటిని ఒడిసి పట్టుకొని భావితరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు తెలిపారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా మండలంలోని ఇక్కుర్రు గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో ఏర్పాటు చేయనున్న సేద్యపు నీటి కుంట పనులను శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ అరుణ్బాబు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఆర్డీవో మధులత, డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తిలు పాల్గొన్నారు. దాదాపు రూ.43 వేలతో ఏర్పాటు చేయనున్న సేద్యపు నీటి కుంట పనులకు భూమి పూజ చేశారు. అనంతరం రొంపిచర్ల మండలం విప్పర్లపల్లిలో నీటి కుంటను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాణవాయువు తరువాత నీరే మనకు ప్రాణాధారమని తెలిపారు. నీటి వనరులను పరిమితమని, జలాన్ని వృథా చేయకుండా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో టీవీ కృష్ణకుమారి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
అధికారులను ఆదేశించిన
జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు
గోదాములో ఈవీఎంలు పరిశీలన