జాతీయ భావంతో విద్యార్థుల నిర్మాణమే లక్ష్యం
బాపట్ల: విద్యార్థుల సమస్యలపై పోరాటంతో పాటు వారిని జాతీయ భావాలతో నిర్మాణాత్మక ంగా తీర్చిదిద్దడమే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లక్ష్యం అని రాష్ట్ర అధ్యక్షులు నూజెండ్ల శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపం ప్రాంగణంలో ఆదివారం ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. తొలుత రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రిటైర్డ్ రీడర్ యు. వరలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నూజెండ్ల మాట్లాడుతూ విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. వరలక్ష్మి మాట్లాడుతూ 50 సంవత్సరాల కిందట మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి ఏబీవీపీ కార్యక్రమాల్లో చేపట్టిన పనులను గుర్తు చేసుకున్నారు. నేటి యువత సమాజంలో రుగ్మతలు రూపుమాపటానికి ఏ విధంగా ముందుకు వెళ్లాలో సూచించారు. రాష్ట్రం నలుమూలల నుంచి సదస్సుకు వచ్చిన ఏబీవీపీ యువ కెరటాలకు అభినందనలు తెలిపారు. దక్షిణ భారత సంఘటన కార్యదర్శి ఎస్. శివకుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన ఏకై క విద్యార్థి యూనియన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని పేర్కొన్నారు. ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాగంటి వెంకట గోపి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా వెంటనే డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యువతకు నిరుద్యోగ భృతి నెలకు రూ. 3000 అందజేస్తామని ప్రకటించి, అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు 10 నెలలు గడుస్తున్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నిరుద్యోగ యువతకు వెంటనే భృతి అందజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదులో ఉండిపోయాయని, వాటిని తిరిగి రాష్ట్రంలో నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ సూళ్లూరు యాచేంద్ర, వివేకా సర్వీస్ సొసైటీ కార్యదర్శి అంబటి మురళీకృష్ణ, ప్రముఖ ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం, న్యాయవాది కళ్లం హరినాథ్రెడ్డి, అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్, నంగు ఏడుకొండలురెడ్డి, వల్లూరి భావన్నారాయణ, మామిడి రాజశేఖర్, బాలాజీ, బిల్లూరి భావన్నారాయణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎన్. సుమన్, కార్యదర్శి పవన్ పాల్గొన్నారు.
హామీలు అమలు చేయకుంటే సమ్మె చేస్తాం
గుంటూరు మెడికల్: ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్య వర్గ సమావేశం ఆదివారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న డ్రైవర్స్ అసోసియేషన్ హాలులో జరిగింది. ముఖ్యఅతిథిగా వచ్చిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. ఆస్కార రావు మాట్లాడుతూ తాము ప్రభుత్వం ముందు ఉంచిన సమస్యలన్నీ ఆర్థికేతర అంశాలేనని చెప్పారు. తమ సంఘం తరఫున సుమారు 28 డిమాండ్లను లిఖిత పూర్వకంగా తెలియజేశామని పేర్కొన్నారు. ప్రభుత్వం నేటికీ వాటిని పరిష్కరించిన పాపానపోలేదని వాపోయారు. ఇక పోరాటం తప్పదని తేల్చి చెప్పారు. త్వరలో సమ్మె నోటీసు జారీ చేస్తామన్నారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆహారోన్ మాట్లాడుతూ తమ సంఘాన్ని బలోపేతం చేయడం ద్వారా ఉద్యమానికి జిల్లా శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అధికారులు సత్వరమే మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించాలన్నారు. సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ సాగర్ మాట్లాడుతూ సంఘాన్ని బలోపేతం చేసుకోవాల్సిన సమయం అసన్నమైందన్నారు. ముఖ్య సలహాదారు రమణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొనాలని కోరారు.