రాజుపాలెం: అందరి భాగస్వామ్యంతో శుభ్రమైన గ్రామంగా తయారు చేసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు సూచించారు. మండలంలోని పెదనెమలిపురి గ్రామంలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ఖాళీ స్థలాల్లో, బజార్లలో పేరుకుపోయిన చెత్తను మహిళలు, అధికారులతో కలసి చీపురు పట్టి ఊడ్చి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మండలంలో ప్రతీ గ్రామంలో అధికారులు నిర్వహించాలన్నారు. తడి, పొడి చెత్తలను వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు స్వచ్ఛ కిట్లు అందజేశారు. జిల్లా పంచాయతీ అధికారి భాస్కరరెడ్డి, తహసీల్దార్ దుర్గేష్ రావు, ఎంపీడీఓ జీవీ సత్యనారాయణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.