అద్దంకి/అద్దంకి రూరల్: జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి, కొండపైనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామివార్ల 70వ వార్షిక తిరునాళ్ల శుక్రవారం వైభవంగా నిర్వహించారు. తిరునాళ్ల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. శ్రీశైలం దేవస్థాన డిప్యూటీ కమిషనర్ రమణమ్మ ప్రత్యేకాధికారిగా, ఏసీ తిమ్మనాయుడు ప్రత్యేక సిబ్బంది సహకారంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉచిత దర్శనం కల్పించారు. వీఐపీ, వికలాంగులకు, వృద్ధులకు, ప్రత్యేక దర్శన క్యూలైన్లతోపాటు, వివిధ ధరలతో దర్శన క్యూలను ఏర్పాటు చేశారు. క్యూలైన్లలోని భక్తులకు మజ్జిగ, తాగునీరుతోపాటు, దర్శనం చేసుకున్న వారికి ఉచిత ప్రసాదం పంపిణీ చేశారు. వివిధ బ్యాంక్ బ్రాంచ్లు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మజ్జిగ, తాగునీటిని ఉచితంగా పంపిణీ చేశాయి.
ప్రత్యేక పూజలు..
ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో చీరాల ఆర్డీవో చంద్రశేఖర్నాయుడు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేదపండితులు ఆశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మహిళలు స్వామివారికి చక్కెర పొంగలి వండి, కుండలను నెత్తిన పెట్టుకుని దర్శనంతో మొక్కులు తీర్చుకున్నారు. కొండ మీద శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దేవదాయ శాఖ ఈవో కోటిరెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి కల్యాణం, సామూహిక వ్రతాలు నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా పర్యవేక్షించారు.
వివిధ శాఖల ఆధ్వర్యంలో పర్యవేక్షణ
ఆలయ పరిసరాల్లో, విద్యుత్ శాఖ, మోదేపల్లి పీహెచ్సీ, పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, ఫైర్, మునిసిపల్తో పాటు, మండల పరిషత్, ఎల్ఐసీ, స్టేట్బ్యాంక్ వివిధ బ్యాంక్ బ్రాంచ్లు, స్వచ్ఛంద సేవా సంస్థలు, వాసవీ వనిత క్లబ్ ప్రకాశం ప్రభుత్వ హైస్కూల్1980–81 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటుతో మజ్జిగ, తాగునీరు, పులిహోర పంపిణీ చేశారు.అన్ని సామాజిక సత్రాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు అన్నదానం నిర్వహించారు.
అద్దంకి డిపో నుంచి ప్రత్యేక బస్సులు
అద్దంకి ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడిపారు. వీటితోపాటు జిల్లాలోని వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, ఒంగోలు, దర్శి, పొదిలి తోపాటు వివిధ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడిపారు. కొండమీద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెంకటాపురానికి చెందిన పాకనాటి అంజిరెడ్డి, పాకనాటి మధుసూదన్రెడ్డికి చెందిన రెండు బస్సుల్లో భక్తులను ఉచితంగా చేర వేశారు.
ఆకర్షణీయంగా అంగళ్లు
తిరునాళ్ల సందర్భంగా క్షేత్రానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన బొమ్మల దుకాణాలు, చెరుకు విక్రయ దుకాణాలు, వివిధ వస్తువులతో నిర్వహించిన సంతల్లో భక్తులు వస్తువులను కొనుగోలు చేశారు. తిరునాళ్లలో ఏర్పాటు చేసిన జైంట్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోలీసులు అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా పెట్టారు.
పోటెత్తిన భక్తులు సత్రాల్లో అన్నదానం వివిధ శాఖల స్టాల్స్ ఏర్పాటు మజ్జిగ, తాగునీరు, ప్రసాదాల పంపిణీ 70 సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ
వైభవంగా శింగరకొండ తిరునాళ్ల