సత్తెనపల్లి : జిల్లావ్యాప్తంగా ఈనెల 17 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖాధికారులు సమాయత్తమయ్యారు. విద్యార్థులంతా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హాల్ టిక్కెట్లు పొందిన విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాలను తల్లిదండ్రులతోపాటు ముందుగానే సందర్శించడం మేలు.
విద్యార్థులూ... వీటిని పాటించండి
● ఉదయం 8.30 గంటల కల్లా కచ్చితంగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.
● ఉదయం 8.45 నుంచి 9.30 వరకు మాత్రమే అనుమతిస్తారు. ఆ తర్వాత గేట్లు మూసి వేస్తారు.
● విద్యార్థులంతా హాల్ టికెట్పై ముద్రించిన తమ వివరాలు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, రాయాల్సిన సబ్జెక్టులు, పరీక్ష కేంద్రం పేరు, చిరునామా సరి చూసుకోవాలి.
● తప్పులుంటే ముందుగానే ప్రధానోపాధ్యాయుల ద్వారా ప్రభుత్వ పరీక్షల విభాగం దృష్టికి తీసుకెళ్లి సరి చేయించుకోవాలి.
● పరీక్ష కేంద్రంలో ఇచ్చే క్వశ్చన్ పేపర్పై ఏడు అంకెలతో ప్రత్యేక కోడ్ ఉంటుంది. హాల్ టికెట్పై ఉన్న ఎన్రోల్మెంట్ నంబరు ఆధారంగా కేటాయించిన రూముల వారీగా విద్యార్థులను కూర్చోపెడతారు. బార్ కోడింగ్ విధానంలో రూపొందించిన ఓఎంఆర్ షీట్లను విద్యార్థులకు రోల్ నంబరు ఆధారంగా పంపిణీ చేస్తారు.
● రోల్ నంబరు ఆధారంగా విద్యార్థి తనకు కేటాయించిన సీట్లో కూర్చున్న తరువాత ఇన్విజిలేటర్ వచ్చి బార్ కోడింగ్తో కూడిన ఓఎంఆర్ షీట్, ప్రశ్నపత్రం, ఆన్సర్ బుక్లెట్ అందజేస్తారు. తర్వాత ఓఎంఆర్ షీట్ పూరించే విధానంపై ఇన్విజిలేటర్ ఇచ్చే సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా పాటించాలి. దానిపై అనవసరమైన గీతలు, రాతలు రాయరాదు.
● ఇన్విజిలేటర్ ఇచ్చిన ఓఎంఆర్ షీట్పై విద్యార్థి పేరు, పరీక్షకు సంబంధించిన వివరాలు సక్రమంగా ఉన్నవీ, లేనివీ నిర్ధారించుకోవాలి.
● గైర్హాజరైన విద్యార్థుల ఓఎంఆర్ షీట్లను అక్కడే ఉంచి, పరీక్ష ప్రారంభమైన తరువాత ఇన్విజిలేటర్లు వాటిని స్వాధీనం చేసుకుంటారు. ఉదయం 9.00 గంటలకు ఇన్విజిలేటర్ వచ్చి ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తరువాత, దానిని పూరించేందుకు అవసరమైన సూచనలు చేస్తారు.
● 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమైన తరువాత, మధ్యాహ్నం 12.45 గంటలకు పరీక్ష ముగిసే వరకు విద్యార్థులను బయటకు వెళ్లనివ్వరు.
● గుర్తింపు కార్డు కలిగి, పరీక్షల విధుల్లో ఉన్న అధికారులు, స్క్వాడ్ బృందాలనే పరీక్ష కేంద్రాల్లోకి తనిఖీలకు అనుమతిస్తారు. కేంద్రాల వద్ద పోలీసుశాఖ 144 సెక్షన్ అమలు పర్చడంతో పాటు విస్తృత రీతిలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది.
తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు
చదువులమ్మ చెట్టు నీడలో హాయిగా గడిపే విద్యార్థి జీవితంలో పదో తరగతి మొదటి మెట్టు.. భవిష్యత్కు ఆలంబన.. జీవన పరమపద సోపాన పటంలో తొలి అడుగు. పదిలో వచ్చిన మార్కులే భవితవ్యానికి గీటురాయి. గుడ్డిగా పరీక్షలు రాయకుండా కొన్ని టిప్స్ పాటించడం టాప్ మార్కులు సాధించవచ్చు. ధైర్యం, ఆత్మవిశ్వాసంతో పరీక్షల హర్డిల్ను అధిగమిస్తే చక్కని జీవితానికి మార్గం సుగమం అవుతుంది.
విద్యార్థులూ.. గెట్ రెడీ !
ఈనెల 17 నుంచి ప్రారంభం
కానున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలు
పరీక్ష కేంద్రంలో పాటించాల్సిన
నిబంధనలపై ప్రభుత్వ మార్గదర్శకాలు
ముందుగానే సందర్శించడం మేలు
ఓఎంఆర్ షీట్, ఆన్సర్ బక్లెట్లో
ఏ ఒక్క పేజీని చించినా మాల్
ప్రాక్టీసుగా పరిగణింపు
ప్రశ్న పత్రం లీకేజీ అయ్యిందని, బయటకు వచ్చిందని కొందరు పనిగట్టుకుని చేసే ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకుండా, విద్యార్థులు పరీక్షలకు ప్రశాంతంగా హాజరు కావాలి. ఒక వేళ ఏదైనా సెంటర్ నుంచి ప్రశ్నపత్రం లీకేజీకి గురైతే, అది ఎక్కడ జరిగిందో గుర్తించే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.
పరీక్ష కేంద్రంలో విద్యార్థులు పక్కవారి పేజీలను చూసి సమాధానాలు రాయాలనే ఆలోచన వీడాలి.
కాపీయింగ్కు పాల్పడినా, జేబులో స్లిప్పులు పెట్టుకుని వచ్చినా, పరీక్ష కేంద్రంలో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. పరీక్ష రాసే సమయంలో స్లిప్పులు కనిపిస్తే పరీక్షల నుంచి డీబార్ చేస్తారు.
ప్రతి విద్యార్థికీ 24 పేజీలతో కూడిన ఆన్సర్ బుక్లెట్ను ఇచ్చి, అదనంగా పేపర్లు అవసరమైతే మరొక 12 పేజీల బుక్లెట్ను ఇస్తారు. సైన్స్ పరీక్షకు 12 పేజీల బుక్లెట్ ఇస్తారు. విద్యార్థులకు ఇచ్చిన ఓఎంఆర్ షీట్, ఆన్సర్ బక్లెట్లలో ఏ ఒక్క పేజీని చింపినా మాల్ ప్రాక్టీసుగా పరిగణించే విధంగా కఠినమైన నిబంధనలు అమలు పరుస్తోంది.