శావల్యాపురం: కేంద్ర ప్రభుత్వం సారధ్యంలో 544డీ జాతీయ రహదారి నాలుగు లైన్ల విస్తరణ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే తెలిపారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 544డీ జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించే పనులకు సంబంధించిన భూసేకరణపై రెవెన్యూ, జాతీయ రహదారి అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ వినుకొండ నుంచి గుంటూరు వరకు 85 కి.మీ వరకు నిర్మించనున్న రోడ్డుకు రూ.2605 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. పల్నాడు జిల్లాలో నాలుగు మండలాలకు గాను 19 గ్రామాల పరిధిలో 53.3కి.మీ మేర పనులు జరుగుతాయన్నారు. ఇందుకుగాను జాతీయ రహదారి అధికారులు మ్యాప్ సిద్ధం చేసి ప్రాథమికంగా సమాచారాన్ని సేకరించారన్నారు. మొదట దశలో 3ఏ గెజిట్ నోటిఫికేషన్, రెండవ దశలో భూసేకరణ చేసిన భూముల్లో రెవెన్యూ, నేషనల్ హైవే అధికారుల సంయుక్త మార్కింగ్ పనులు.. మూడో దశలో డిక్లరేషన్ ఆఫ్ ల్యాండ్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయడం.. నాల్గో దశలో జేసీ సారధ్యంలో రైతుల నుంచి సేకరించిన భూములకు పరిహారం.. ఐదవ దశలో జిల్లా కలెక్టరు అనుమతితో భూములను జాతీయ రహదారుల శాఖకు అప్పగించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం మొదటి దశ ప్రారంభమైందన్నారు. సంవత్సరం వ్యవధిలో పనులు పూర్తి చేయటానికి అధికారులు కసరత్తు చేస్తున్నారన్నారు. ఆయనతో పాటు తహసీల్దార్ సబావత్ సురేష్నాయక్, జాతీయ రహదారి అధికారులు వెంకటేశ్వర్లు, అశోక్, మండల సర్వేయర్ రాజు, సర్వే అధికారి పేరిసోముల నాసరయ్య, ఆర్ఐ చంద్రబాబు, తదితరులు ఉన్నారు.