నరసరావుపేట టౌన్: బంగారమైనా, వస్తువైనా, మరే విలువైనదైనా వేలం వేసినప్పుడు సరైన ధర రాకుంటే, లేదా వేలం పాడుకున్న వారినుంచి ఇబ్బందులు ఎదురైతే మళ్లీ వేలానికి వెళతారు. మొదటిసారి వచ్చిన దానికంటే తక్కువకు పాడితే.. మరోసారి వేలం వేస్తారు. ఇదీ బ్యాంకుల్లోగానీ, మరే ఇతర సంస్థల్లోగానీ సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే పల్నాడు జిల్లాల్లోని పౌరసరఫరాల శాఖ అధికారుల తీరు మాత్రం వేరేగా ఉంది. పీడీఎస్ బియ్యం వేలంలో ప్రభుత్వానికి ఆదాయం చూపించాల్సిన అధికారులు.. ప్రజాప్రతినిధులు చెప్పిన వ్యక్తులకు లబ్ధి చేకూరేలా చక్రం తిప్పారు. ప్రజల సొమ్ముకు పంగనామాలు పెట్టి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు.
ఇదీ వేలం కథ...
పల్నాడు జిల్లాలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన రేషన్ బియ్యానికి గతేడాది డిసెంబర్ 18న వేలం నిర్వహించారు. అప్పుడు కిలోకు రూ.32.50 లకు పాడుకున్నారు. అనంతరం సదరు పాట పాడుకున్న వ్యక్తి నగదును పాక్షికంగా చెల్లించడంతో ఆ పాటను రద్దు చేశారు. మరోసారి వేలం నిర్వహించాలని జిల్లా పౌరసరఫరా శాఖ అధికారులు భావించారు. అయితే గతంలో వేలం సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించారో వాటినే మళ్లీ పాటించాలి. ముందుగా పత్రిక ప్రకటన ఇవ్వాలి. జిల్లావ్యాప్తంగా ప్రచారం కల్పించాలి. అప్పుడే ఎక్కువమంది వేలానికి హాజరవుతారు. తద్వారా వేలం ధర ఎక్కువ పలుకుతుంది. ప్రభుత్వ ఖజానాకు మేలు జరుగుతుంది. కానీ ఇవేమీ చేయకుండానే జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ ఏడాది మార్చి 7వ తేదీన వేలం వేసేందుకు నిర్ణయించారు. గతంలో కేజీ రూ.32.50లు పలికిన ధరను ఇప్పుడు సగటున కేవలం రూ.22.50లకు అంటగట్టారు. బియ్యం ధర కేవలం మూడు నెలల్లోనే అమాంతంగా తగ్గిపోయింది. దీని వెనుక ప్రజాప్రతినిధులు, జిల్లా పౌరసరఫరాల అధికారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.35 లక్షలు నష్టం వాటిల్లింది.
పల్నాడు జిల్లా వ్యాప్తంగా పట్టుబడ్డ రేషన్ బియ్యం వేలంలో ఐదుగురు మాత్రమే పాల్గొనటం గమనార్హం. సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు గ్రామానికి చెందిన అక్రమ రేషన్ బియ్యం వ్యాపారి తన బినామీలతో వేలంలో పాల్గొనగా.. ఆయనే తక్కువ ధరకు బియ్యాన్ని దక్కించుకున్నాడు. పాటలో ఎవరూ పాల్గొనకుండా వ్యాపారుల నుంచి అధికారుల దాకా అంతా మేనేజ్ చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లావ్యాప్తంగా పట్టుబడిన
రేషన్ బియ్యానికి గుట్టుచప్పుడు
కాకుండా వేలం
గతంలో కిలో రూ.32.50లకు పాడుకున్న పాటదారులు
ఇదే బియ్యాన్ని రూ.22.50లకు అధికారపార్టీ నేతకు కట్టబెట్టిన వైనం
ఇదీ జిల్లా పౌరసరఫరాల శాఖ
అధికారుల తీరు
ప్రచారం లేదు.. ప్రకటనా కానరాదు
ప్రభుత్వ ఖజానాకు సుమారు
రూ.35 లక్షలు గండి
ప్రజాప్రతినిధి ఆదేశాల మేరకే
హడావుడిగా కార్యక్రమం
నిబంధనల ప్రకారమే..
పట్టుబడ్డ రేషన్ బియ్యం మూడు నెలల క్రితం వేలం వేయగా కేజీ రూ.32.50ల వరకు పాడారు. అతను రూ.లక్ష చెల్లించి మిగిలిన డబ్బులు కట్టేందుకు ముందుకు రాకపోవటంతో తిరిగి వేలం నిర్వహించాం. మూడు రకాల క్వాలిటీ ఉండటంతో ఒక రకం రూ.24, రెండవ రకం రూ.22, మూడవ రకం రూ.20 లకు వేలంలో పాడారు. వేలం విషయంపై డీఎస్ఓ కార్యాలయం వద్ద నోటీస్ అంటించి ప్రచారం నిర్వహించాం. ఎటువంటి ప్రకటనలు ఇవ్వలేదు.
– నారదముని,
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
టీడీపీ నేతకు రేషన్ బియ్యం అప్పగించేందుకు అధికారుల తాపత