● కనమర్లపూడిలో టీడీపీ నాయకుల దందా ● ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు ● గ్రామ మాజీ సర్పంచి తన్నీరు అంకారావు
శావల్యాపురం: మండలంలోని కనమర్లపూడిలో గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు స్థానిక టీడీపీ నాయకులు కమీషన్ల పేరుతో మోకాలడ్డుతున్నారని, తమకు కమీషన్లు ఇవ్వని వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని గ్రామ మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నేత తన్నీరు అంకారావు ఆరోపించారు. బుధవారం గ్రామంలో రూ. 7 లక్షల వ్యయంతో బీసీ కాలనీ నుంచి వీరరాఘవులు దేవాలయం వరకు సర్పంచ్ తన్నీరు భారతి ఆధ్వర్యంలో రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. అయితే టీడీపీ నాయకుడు గోరంట్ల హనుమంతరావు తమకు రూ. 4లక్షల కమీషన్ ఇస్తేనే పనులు కొనసాగించాలని డిమండ్ చేశారని తన్నీరు ఆరోపించారు. కమీషన్ ఇవ్వకపోవడంతో పనులు జరుగుతున్న ఏరియాలోని బీసీ కాలనీవాసులతో స్థానిక వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయింపజేశారని, టీడీపీ నేతల సూచనలతోనే స్థానిక పోలీసులు రంగ ప్రవేశం చేసి వైఎస్సార్ సీపీ గ్రామ నాయకులను పోలీసు స్టేషన్కు తీసుకొని రావటాన్ని తన్నీరు ఖండించారు. వైఎస్సార్ సీపీ మండల కో–ఆర్డినేటరు బోడెపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులకు ఇందులో వాటా ఉందని.. కమీషన్ ఇవ్వాలంటూ బీసీ సర్పంచ్ను టీడీపీ నేతలు బెదిరించటం దుర్మార్గమన్నారు. సీసీ రోడ్డు పనులు అడ్డుకోవడం తగదన్నారు. బోడెపూడి వెంకటేశ్వర్లు, నలబోలు శ్రీహరి, పుట్టా సురేష్, పుట్టా యోగయ్య, మర్రి ఏడుకొండలు, తదితరులు ఉన్నారు.