వైఎస్సార్ విగ్రహానికి పూలదండ వేయడానికీ
పోలీసుల తీరుపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పీఆర్కే అభ్యంతరం
రెంటచింతల: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళుల ర్పించడానికి కూడా పోలీసుల అనుమతి కావాలా అంటూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన రెంటచింతలలోని ప్రధాన రహదారి వెంబడి ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడానకి వస్తున్న మాజీ ఎమెల్యే పీఆర్కేను పోలీసులు అనుమతి తీసుకోలేదని గ్రామంలోకి రాకుండా స్థానిక జాతీయ రహదారి 167 ఏడీ వద్ద అడ్డుకున్నారు. దీనిపై పీఆర్కే స్పందిస్తూ మైక్ పెట్టేందుకు, ర్యాలీలకు అనుమతులు కావాలని, కానీ దారిలో వెళ్తూ డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల కూడా అనుమతులు కావాలని చెప్పడం మంచి పద్దతి కాదన్నారు. దీంతో గురజాల డీఎస్పీ బీఎల్ఎన్ జగ దీష్తో పీఆర్కే ఫోన్లో మాట్లాడారు. లా అండ్ అర్డర్ సమస్య కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. సుమారు 20 నిమిషాల వరకు వేచి చూసినా పోలీసులు గ్రామంలోనికి అనుమతించక పోవడంతో పీఆర్కే వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయం వద్ద తలపెట్టిన యువతపోరుకు తరలివెళ్లారు. ఆయన వెంట జడ్పీ వైస్ చైర్మన్ శొంఠిరెడ్డి నర్శిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గొట్టం బ్రహ్మారెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు నవులూరి భాస్కర్రెడ్డి, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ మద్దిరాల కృష్ణారెడ్డి, పాలువాయి గేటు సర్పంచ్ గొలమారి శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు ఏరువ ప్రతాప్రెడ్డి, గాలి ప్రతాప్రెడ్డి, గొట్టం భాస్కర్రెడ్డి, చల్లా మల్లారెడ్డి, యర్రెద్దు శ్రీనివాసరెడ్డి, శొంఠిరెడ్డి గురవారెడ్డి, గుండా కిశోర్, శీలం అంజయ్య తదితరులున్నారు.