సాక్షి, నరసరావుపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ వేడుకలు మంగళవారం పల్నాడు జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. నరసరావుపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావు, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గజ్జల సుధీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారీగా హాజరైన పార్టీ నేతలు, కార్యకర్తలతో మంగళవారం ఉదయం 11 గంటలకు పండుగ వాతావరణం నెలకొంది. జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జిలు పార్టీ జెండాను ఆవిష్కరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ 15 సంవత్సరాల ప్రస్థానాన్ని నేతలు, కార్యకర్తలు గుర్తుచేసుకున్నారు. జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి మాట్లాడుతూ ఆవిర్భావ కార్యక్రమానికి వచ్చిన నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ప్రజల అభ్యున్నతి కోసం వైఎస్సార్ సీపీ నిరంతరం పోరాడుతుందన్నారు. అందుకే కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకొందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురవుతున్న రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల తరపున వైఎస్సార్ సీపీ రాజీలేని పోరాటం చేసి వారి హక్కులు కాపాడుతుందన్నారు. వారందరి సమస్యలే పార్టీ అజెండాగా పార్టీ అధినేత వైఎస్ జగన్తో కలిసి తాము ముందుకు సాగుతామన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మరోసారి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యేలా కార్యకర్తలు శ్రమించడం అభినందనీయమన్నారు. రానున్న వైఎస్ జగన్ ప్రభుత్వం 2.0లో కార్యకర్తల కష్టానికి తగిన ప్రతిఫలం తప్పక దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
ఘనంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుకలు
నరసరావుపేటలోని జిల్లా కార్యాలయంలో పార్టీ పతాకావిష్కరణ హాజరైన జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జిలు జిల్లావ్యాప్తంగా 15వ ఆవిర్భావ సంబరాలు వేడుకగా నిర్వహించిన పార్టీ శ్రేణులు
ప్రజా సమస్యలే పార్టీ అజెండా