శావల్యాపురం: మండలంలోని వేల్పూరుకు చెందిన కంచర్ల సుబ్బారావు (55) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల అనుమతితో శంకర కంటి వైద్యశాలకు మృతుడి నేత్రాలను దానం చేసినట్లు జిల్లా అమ్మ నేత్ర, అవయవ దాన సంఘం కోఆర్డినేటరు సండ్రపాటి చలపతిరావు తెలిపారు. అవయవ దానం చేయడం పలువురికి ఆదర్శనీయమని కొనియాడారు. నేత్ర దానానికి సహకరించిన సుబ్బారావు కుటుంబ సభ్యులు ఆలపాటి శివ, సుబ్రహ్మణ్యం, సురేష్, పరమేశ్వరరావు, అంజయ్యను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఒక్క మాత్రతో నులిపురుగుల నివారణ
గుంటూరు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి
గుంటూరు మెడికల్: జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా సోమవారం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. ఒకే మాత్రతో నులి పురుగులను నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో ఏడాది నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ తప్పనిసరిగా నులిపురుగుల నిర్మూలన కోసం 400 ఎంజీ ఆల్బెండజోల్ బిళ్లలను చప్పరించి మింగించాలని తెలిపారు. ఏడాది నుంచి రెండేళ్ల పిల్లలకు అరమాత్ర, 2 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు పూర్తి మాత్ర ఇవ్వాలని సూచించారు. సోమవారం వీలు కాని వారితో ఈ నెల 17వ తేదీన మాపప్ రౌండ్లో మింగించాలన్నారు. పిల్లలకు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత గంట తేడాతో మాత్రలు ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. జిల్లాలో అర్హులైన పిల్లలు 4,24,742 మంది ఉన్నారని చెప్పారు. కార్యక్రమాన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహిస్తారని తెలిపారు. నులిపురుగుల నిర్మూలన వల్ల పిల్లలలో రక్తహీనతను నివారించి వారి ఆరోగ్యాన్ని సంరక్షించవచ్చని పేర్కొన్నారు.
ఏఎన్ఎంలపై పనిఒత్తిడి తగ్గించాలి
ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.రోశయ్య
బాపట్ల: ఏఎన్ఎంలపై పని ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.రోశయ్య పేర్కొన్నారు. బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో అసోసియేషన్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో కె.రోశయ్య మాట్లాడుతూ తాలుకా, జిల్లా బాడీలను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. 143 జీఓని రద్దు చేయాలని కోరారు. ఏఎన్ఎంలపై ఒత్తిడి తగ్గించాలని, గ్రేడ్ 3 ఏఎన్ఎంలను వైద్యశాఖలోకి తీసుకోవాలని కోరారు. పీ4 సర్వేలో ఏఎన్ఎంలను మినహాయించాలన్నారు. సమావేశంలో నాయకులు సీహెచ్ బెనర్జీ, జె.సుధాకర్, ఎన్.సుబ్బారావు, కె.మారుతి ప్రసాద్, రత్నకుమారి, రమణమ్మ, సైదయ్య, వేణు, మహబూబ్, రాజేష్, బాపట్ల టౌన్ అధ్యక్షుడు జి.శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
శంకర కంటి ఆస్పత్రికి నేత్ర దానం
శంకర కంటి ఆస్పత్రికి నేత్ర దానం