
ఉపాధిహామీ పథకం పనులు నిర్వహిస్తున్న కార్మికులు
యడ్లపాడు: ఈ –శ్రమ్ పోర్టల్... అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత, ఆర్థిక సాయం అందించే ఉద్దేశంతో రూపొందించబడింది. వలస, అసంఘటిత కార్మికులు కోవిడ్ సమయంలో పడిన ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. సీ్త్ర, పురుషులెవరైనా రూ.15 వేల లోపు ఆదాయం కలిగిన వారికి గుర్తింపుకార్డులిస్తారు. ఈ – శ్రమ్పోర్టల్ ద్వారా ఆధార్కార్డు తరహాలో యూఏఎన్ (యూనివర్సిల్ అకౌంట్ నంబర్)ను కేటాయిస్తారు. కార్మికుడు దేశంలో ఎక్కడికి వెళ్లినా ఈకార్డుతో ప్రయోజనం చేకూరనుంది. కార్మిక శాఖ అధికారులు, వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో విస్తృతస్థాయిలో అవగాహన కల్సిస్తున్నారు. పల్నాడు జిల్లాలో అనధికారికంగా సుమారు 3.5 లక్షలకు పైగా అసంఘటిత కార్మికులు ఉండగా, వీరిలో 63,017 మంది ఈ –శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్నారు. వీటిలో సీఎస్సీ ద్వారా 37,769, ఆన్లైన్ ద్వారా 25,248 మంది స్వయంగా నమోదు చేసుకుని గుర్తింపు కార్డుల్ని పొందారు.
వారికి మంచి అవకాశం...
ఈ –శ్రమ్ పోర్టల్లో నమోదైన కార్మికుల్లో 24.8.2021 నుండి 31.03.2022 మధ్య కాలంలో ఎవరైనా ప్రమాదవశాత్తు, విపత్తుల కారణంగా చనిపోయినా, అంగవైకల్యం ఏర్పడిన వారికి నష్ట పరిహారం అందించేందుకు ప్రభుత్వం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ప్రమాదవశాత్తు మరణించినా, పూర్తి అంగవైకల్యం ఏర్పడినా కార్మికుడికి రూ.2 లక్షలు, అలాగే పాక్షికంగా వైకల్యం కలిగిన వారికి వైకల్యశాతాన్ని బట్టి రూ.లక్ష వరకూ పరిహారం అందిస్తారు. దీని విషయంపై జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆధ్వర్యంలో తాజాగా జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించే ఈ కమిటీని త్వరలోనే ఏర్పరచి కార్మికుల సంక్షేమ సహాయం కోసం హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేయనున్నారు. వీటిద్వారా నష్టపోయిన కార్మిక కుటుంబాల నుంచి దరఖాస్తులను స్వీకరించి, కమిటీ పరిశీలనానంతరం అర్హత కలిగిన వారికి పథకం పరిహారం అందిచేలా చర్యలు తీసుకుంటున్నారు.
అర్హులు ఎవరంటే...
వలస, భవన నిర్మాణ, వ్యవసాయ, మత్స్య, పశుపోషణ, క్వారీ, నూలు మిల్లు, ఇటుక బట్టీ, సరుకులు, కూరగాయలు, పండ్ల విక్రేతలు, వార్త పత్రిక విక్రేతలు, రిక్షా కార్మికులు, ఆటోడ్రైవర్లు, ఆశ, అంగన్వాడీ వర్కర్లతో పాటు అసంఘటిత రంగాల్లో పనిచేసే వారంతా ఈ పథకానికి అర్హులు. అయితే కార్మికుల వయసు 18–60 మధ్య ఉండి ఈఎస్ఐ కార్డు పొందని, ఈపీఎఫ్కు అవకాశం లేని వారు నమోదు చేసుకోవచ్చు.
ఎక్కడ నమోదు చేస్తారంటే..
సమీప గ్రామ/వార్డు సచివాలయం, సీఎస్సీ సెంటర్, పోస్టాఫీస్, లేబర్ ఫెసిలిటేషన్ సెంటర్లలో నమోదు చేసుకోవచ్చు. పథకం రిజిస్ట్రేషన్కు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు, ఇది పూర్తిగా ఉచితం. కేవలం కార్మికుని ఆధార్ కార్డు, బ్యాంక్ఖాతా నంబర్(ఐఎఫ్ఎస్సీ కోడ్తో సహా), బ్యాంకు, ఆధార్కార్డుతో లింకేజీ కలిగిన ఫోన్ నంబర్ ఉండాలి. ఈ కార్డులు పొందిన అసంఘటిత కార్మికులు సామాజిక భద్రతా చట్టం కింద సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందుతారు. ఇది వృత్తి నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను అందించడానికి ఉపయోగపడుతుంది. ఆర్థిక సహాయం నేరుగా వారి అకౌంట్కు జమ చేస్తారు.
వలస జీవులకూ...
పొట్ట చేతపట్టుకుని వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి పనుల కోసం వచ్చిన వారికి ఒక్కోసారి పనిలేక పస్తులుండాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వలస కార్మికులకూ రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారు. వేరే రాష్ట్రం వారైనా ఇక్కడ దరఖాస్తు చేసుకుంటే రేషన్ కార్డు ఇస్తున్నారు.
ఈ –శ్రమ్ పోర్టల్
ఉచితంగా ఈ –శ్రమ్ కార్డు నమోదు ప్రణాళిక
దేశంలో ఎక్కడైనా లబ్ధిపొందేలా చర్యలు
క్షేత్రస్థాయిలో అవగాహన
కల్పిస్తున్న అధికారులు
ఎన్నో ప్రయోజనాలు..
ఈ –శ్రమ్ పోర్టల్ ద్వారా గర్తింపు కార్డుతో కార్మికులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. తాజాగా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. అందుకు ప్రత్యేక కమిటీని ఏర్పరచి కార్మికులకు న్యాయం చేసేదిశగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన(పీఎం–ఎస్వైఎం)లో చేరిన కార్మికులకు పెన్షన్ సదుపాయం కూడా వర్తిస్తుంది.
–దండమూడి లక్ష్మి, సహాయ కార్మిక
కమిషనర్, పల్నాడు జిల్లా ఇన్చార్జి ఆఫీసర్
