
కలకలం..!
బుధవారం శ్రీ 25 శ్రీ జూన్ శ్రీ 2025
● పూరీ ఆలయంలో దశ మూలికల మోదకం దొంగతనం ఆరోపణ ● ఫిర్యాదు చేసిన బలభద్ర స్వామి బాడొగ్రాహి హల్దర్ దాస్ ● ఘటనపై చెలరేగుతున్న దుమారం ● ఆరోపణలు అవాస్తవం: సీఏవో అరవింద కుమార్ పాఢి
భువనేశ్వర్: పూరీ శ్రీజగన్నాథుని రథయాత్ర దగ్గర పడుతున్న తరుణంలో స్వామివారి చికిత్స కోసం ఏర్పాటు చేసిన దశ మూలికల మోదక దొంగతనం ఆరోపణ తీవ్ర కలకలం రేపుతోంది. బలభద్ర స్వామి మూల విరాటు బాడొగ్రాహి ప్రత్యక్షంగా శ్రీమందిరం పాలన అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విచారకర ఘటనపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణ అవాస్తవమని ప్రాథమిక విచారణలో తేలిందని శ్రీమందిరం ప్రధాన పాలన అధికారి (సీఏవో) డాక్టర్ అరవింద కుమార్ పాఢి తోసిపుచ్చారు. ఆయన అభిప్రాయం ఆధారంగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ఘాటుగా స్పందించారు. ఈ ఆరోపణ పూర్తిగా అబద్ధమని, స్వీయ ప్రచారం కోసం నిరాధారమైన ఆరోపణగా వ్యాఖ్యానించారు. విచారణలో నిజం నిగ్గు తేలితే తెర వెనక వర్గాలపై చర్యలు తప్పవని బాహాటంగా హెచ్చరించారు. మరోవైపు ఘటనపై బిజూ జనతా దళ్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇదో విపత్కర ఘటనగా పేర్కొన్నారు. లోగడ ఇటువంటి సంఘటనల దాఖలాలు లేవన్నారు. భగవంతుని విషయంలో రాజకీయం తగదని బీజేడీ నాయకుడు లెనిన్ మహంతి హితవు పలికారు. సీసీ టీవీ రికార్డింగు వంటి అనుబంధ ఆధారాలతో ఆరోపణపై విచారణ పూర్తయితే వాస్తవం తేటతెల్లమవుతుందని శ్రీ మందిరం సీఏవో వెల్లడించారు.
70 మోదకాలు తగ్గినట్లు ఆరోపణ
తెర చాటున చికిత్స పొందుతున్న మూల విరాటులకు ఆలయ ఆచారం ప్రకారం ఒణొసొరొ ఏకాదశి పురస్కరించుకుని ఈనెల 21న దశ మూలికా మోదకం సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి సేవ కోసం సరఫరా చేసిన 313 మోదకాల్లో 70 దశ మూలిక మోదకాలు తక్కువ ఉన్నట్లు బలభద్ర స్వామి బాడొగ్రాహి హల్దర్ దాస్ మహాపాత్రో గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ మోదకాలు దొంగిలించినట్లు ఆయన ఆరోపించారు. స్వామి సేవకు ముందు వీటిని స్పర్శించడంతో పవిత్రత లోపించినా గత్యంతరం లేని పరిస్థితుల్లో సేవ యథాతథంగా కొనసాగించినట్లు వివరించారు. స్వామి గోప్య సేవల కోసం సరఫరా చేసే మోదకాలను లెక్కించడం జరగదు. అనుబంధ వర్గాలు అందజేసే మోదకాలను యథాతథంగా శ్రీమందిరానికి తరలించడం జరుగుతుంది. సంబంధిత సేవాయత్ల సమాచారం ఆధారంగా లాంచనంగా రికార్డు నిర్వహణ కొనసాగుతుందని శ్రీ మందిరం సీఏవో తెలిపారు. ఈ క్రమంలో సీసీటీవీ రికార్డింగ్ ఆధారంగా వాస్తవం బయటపడే అవకాశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు శ్రీ జగన్నాథుని బాడొగ్రాహి వర్గాలు ఆరోపణని బలపరుస్తున్నాయి. వివాదస్పదమైన ఆరోపణపై విచారణ జరిపేందుకు శ్రీమందిరం ప్రధాన నిర్వాహకుడు, డిప్యూటీ నిర్వాహకుడు మరియు ఆలయ కమాండర్ సభ్యులుగా ప్రత్యేక కమిటీని నియమించారు. విచారణ కాల పరిమితిని స్పష్టం చేయలేదు.
న్యూస్రీల్

కలకలం..!

కలకలం..!

కలకలం..!