కొరాపుట్: పేదల నివాసాలు కూల్చడమే ప్రభుత్వ లక్ష్యమా అని బీజేడీ రాష్ట్ర సాధారణ కార్యదర్శి, మాజీమంత్రి రమేష్ చంద్ర మజ్జి ప్రశ్నించారు. నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కోట్లోని తన నివాసంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. గత పది రోజుల్లో జిల్లాలో అనేక చోట్ల పేదల నివాసాలు కూల్చేయడం సరికాదన్నారు. రాయిఘర్ సమితి హత్తబెడాలో 28 మంది పేదల నివాసాలను కూల్చివేయడం దారుణమన్నారు. అదేవిధంగా ఉమ్మర్కోట్ సమితిలో పేదల దుకాణాలు, ఇళ్లు కూల్చేశారన్నారు. సుమారు 50 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో పేదలు నిర్మించుకున్న ఇళ్లు కూల్చడంపై అసహనం వ్యక్తం చేశారు. కనీసం ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేతలు జరుగుతున్నాయని మండిపడ్డారు. దీనిపై తమ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
ఆక్రమణలు తొలగించాలని ఆదేశం
పర్లాకిమిడి: స్థానిక హైస్కూల్ జంక్షన్ నుంచి కాలేజీ రోడ్డు, మార్కెట్ జంక్షన్ వరకు ఉన్న దుకాణదారులు బుధవారంలోగా ఆక్రమణలు తొలగించాలని సబ్ కలెక్టర్ అనుప్ పండా ఆదేశాలు జారీ చేశారు. రథయాత్ర జరగనున్న ప్రదేశంలో గుండిచా బడి, చర్చి రోడ్డు వరకు ఉన్న ఆక్రమణలు మంగళవారం తొలగించారు. రానున్న రథయాత్రకు ఎక్కువ మంది భక్తులు రానున్న నేపథ్యంలో జిల్లా సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, పురపాలక ఈవో లక్ష్మణముర్ము, ఇతర మున్సిపల్ సిబ్బంది ఈ చర్యలు తీసుకున్నారు.
డ్రైనేజీ పనులు ఆపాలని వినతి
పర్లాకిమిడి: స్థానిక ఎస్కేసీజీ కళాశాల హాస్టల్ వద్ద రోడ్డు విస్తరణలో జరుగుతున్న డ్రైనేజీ పనులను ఆపాలని గజపతి జిల్లా బీజేపీ శ్రేణులు రోడ్లు, భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. పర్లాకిమిడి టౌన్ రోడ్డులో భాగంగా అగ్నిమాపక దళం జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి. అయితే ఖంజావీధి నుంచి కాలేజీ రోడ్డు జంక్షన్ వద్ద జరుగుతున్న డ్రైనేజీ పనులపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న పనులను ఆపాలని బీజేపీ నాయకులు బాలకృష్ణ పాత్రో, బబునా బెహరా, సాధారణ కార్యదర్శి జగన్నాథ మహాపాత్రో తదితరులు వినతిపత్రం ఎస్ఈ అభిషేక్ శెఠికి అందజేశారు. కార్యక్రమంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు అరుణిమా సాహు, ఇందిరా పట్నాయక్, ఎంపీ ప్రతినిధి దారపు రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి పాణిగ్రాహికి అవార్డు
పర్లాకిమిడి: రాష్ట్రంలో ప్రథమ ప్రైవేటు ఆస్పత్రి హైటెక్ మెడికల్ కళాశాలల చైర్మన్ డా.తిరుపతి పాణిగ్రాహి భువనేశ్వర్లో టైమ్స్ హెల్త్ ఐకాన్ అవార్డును బాలీవుడ్ నటి రవీనా టాండన్ చేతులమీదుగా అందుకున్నారు. భువనేశ్వర్లోని ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ ఐకాన్ అవార్డు ఉత్సవానికి ముఖ్య అతిథిగా గవర్నర్ హరిబాబు కంభంపాటి హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో హైటెక్ గ్రూప్ గత పదేళ్లుగా ముఖ్య భూమిక పోషించిందని గవర్నర్ అభినందించారు. హైటెక్ గ్రూప్స్లో పనిచేస్తున్న డాక్టర్లు సంజయ్ కుమార్ జంగ్దీ, డా.దీపక్ కుమార్ దాస్, హైటెక్ గ్రూప్ డిప్యూటీ డైరెక్టర్ డా.అనిల్ కుమార్ పాణిగ్రాహి, హృద్రోగ నిపుణులు డీన్ ప్రొ.డాక్టర్ అక్షయ కుమార్ సాహు, ప్రొ.డా.అమ్రిత్ పట్టజోషి, సీఈవో జ్యోతిర్మయి పండా, డా.విక్రం కుమార్ సింగ్లు అవార్డులు స్వీకరించారు.

పేదల నివాసాలు కూల్చడం సరికాదు