
శ్రీ జగన్నాథునికి ఖొల్లి లగ్గి సేవ
భువనేశ్వర్: జగన్నాథుడిని యాత్రకు సిద్ధం చేసేందుకు గోప్య సేవకుల వర్గం తలమునకలై ఉంది. గత 13 రోజులుగా స్వామి సోదరీ సోదరులతో కలిసి తెర చాటున గోప్య సేవలు పొందుతున్నాడు. ఆషాఢ కృష్ణ పక్ష త్రయోదశి తిథి పురస్కరించుకుని స్వామి వారికి ఖొల్లి లగ్గి సేవ నిర్వహించారు. రాత్రి పూట ఈ సేవని చేపట్టారు. జ్వరం నుంచి ఉపశమనం పొందడంతో శారీరక దారుఢ్యం కోసం పలు లేపన సామగ్రి గోప్య మండపానికి తరలించడం ఖొల్లి లగ్గి సేవలో భాగం.
శుద్ధ సువార్ సేవకుల ఇంటి నుంచి ఈ సామగ్రిని తీసుకుని వెళ్లడం ఆచారం. ముందు రోజు ద్వాదశి నాడు చీకటి పడిన తర్వాత శ్రీ మందిర సముదాయం విమలా దేవి పీఠం ఆవరణలో ఉన్న బావి నుంచి నీరు తోడుకుని పోయి స్వామి చికిత్స కోసం అవసరమైన లేపనాలు తయారు చేశారు. బాజా, తురాయి, ఘంటానాదంతో శుద్ధ సువార్ ఇంటి నుంచి శ్రీ మందిరానికి ఊరేగింపుగా ఔషధ సామగ్రిని సోమవారం తరలించారు. ఈ లేపన సామగ్రిని బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథుని శ్రీ అంగాలకు పూర్తిగా అద్దుతారు. దీనితో శరీరం వజ్ర దారుఢ్యంతో మెరుస్తుంది.