
సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి
● కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ధర్నా
శ్రీకాకుళం పాతబస్టాండ్: అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.కల్యాణి, డి.సుధ డిమాండ్ చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి లేదా సంక్షేమ పథకాలైనా అమలు చేయాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. ముందుగా ఆర్ అండ్ బీ బంగ్లా రోడ్డు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చిరుద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అంగన్వాడీలను సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు చేసినందువలన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినెలా లబ్ధిదారుల ముఖ ఆధారిత గుర్తింపు(ఎఫ్.ఆర్.ఎస్) రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేశారు.
వేధింపులకు పాల్పడుతున్నారు
కోటబొమ్మాళి మండలంలో అంగన్వాడీలపై అధికార పార్టీ నేతలు రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గత నెలలో ఇద్దరు అంగన్వాడీ వర్కర్లను రాజకీయ కక్షలతో తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన అంగన్వాడీల ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశా రు. ధర్నా అనంతరం జిల్లా పరిషత్లో డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావుకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు కె.సూరయ్య, ఎన్.వి.రమణ, ఆర్.ప్రకాశరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ఎన్.హైమవతి, పి.లతాదేవి, కె.సుజాత, జె.కాంచన, కె.లక్ష్మి, ఎస్.ఆదిలక్ష్మి, పి.రమణమ్మ, వి.హైమవతి, కె.మోహిని, జ్యోతి, టి.రాజేశ్వరి, వై.విజయలక్ష్మి పాల్గొన్నారు.