
రథయాత్ర నిర్వహణ పవిత్ర బాధ్యత: సీఎం
భువనేశ్వర్: శ్రీ జగన్నాథుడు స్వస్థతతో క్రమంగా యథా స్థితికి చేరుకుని దైనందిన సేవలు అందుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. మరి కొద్ది రోజుల్లో స్వామి పూర్తిగా కోలుకుని యాత్రకు బయల్దేరుతాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రథయాత్రకు సంబంధించిన తుది సన్నాహక సమీక్ష సమావేశం పూరీ మున్సిపాలిటీ టౌన్ హాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధ్యక్షతన జరిగింది. ఆయనతో ఇద్దరు ఉప మఖ్యమంత్రులు ప్రభాతి పరిడా, కనక వర్ధన్ సింగ్దేవ్, న్యాయ, పట్టణాభివృద్ధి, ఆరోగ్యం, సంస్కృతి శాఖల మంత్రులు, పూరీ జిల్లా పార్లమెంటు సభ్యులు, శాసన సభ సభ్యులు, పోలీసు, ఆరోగ్యం, అగ్నిమాపక మరియు పౌర శాఖల ఉన్నత అధికారులు సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి మాట్లాడుతు రథయాత్రను సజావుగా నిర్వహించడం ప్రభుత్వ విధి మాత్రమే కాదు, పవిత్రమైన బాధ్యత అని పేర్కొన్నారు. స్వామి యాత్ర ఒడిశా సాంస్కృతిక వారసత్వానికి ఘనమైన ప్రతీకగా ఆయన అభివర్ణించారు. లక్షలాది మంది ప్రజల భావోద్వేగాలు జగన్నాథ రథ యాత్రతో ముడిపడి ఉన్నాయన్నారు. అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలు పూర్తి సమన్వయంతో పని చేసి దైవికమైన ప్రపంచ ప్రఖ్యాత ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడానికి దోహదపడాలని ఆయన పిలుపునిచ్చారు.
యాత్ర సంబంధిత పూజాదుల్ని నిర్ధారిత వేళల్లో సకాలంలో పూర్తి చేయడంలో సేవాయత్ వర్గాలు సహృదయంతో సహకరించాలన్నారు. ఈ వర్గం ఆచారాల పవిత్రత, క్రమశిక్షణ యాత్రలో అత్యంత ప్రధానమన్నారు. రథాలు లాగే సందర్భంగా పటిష్టమైన క్రమబద్ధీకరణ, క్రమశిక్షణతో జన సందోహంపై నిఘా వేసి అవాంఛనీయ సంఘటనలను నివారించడం యాత్ర తొలి విజయంగా నిలుస్తుందని తెలిపారు. యాత్రలో భక్తులకు సదవకాశం కల్పించే దిశలో తొక్కిసలాట వంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఇటీవల కొన్ని జిల్లాల్లో అతిసార ప్రబలిన విషయం తెలిసిందే. యాత్ర సమయంలో ఈ పరిస్థితి పట్ల అనుబంధ యంత్రాంగంతో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలుషిత ఆహారం, అసురక్షిత తాగునీటి అమ్మకాలను నిరోధించాలన్నారు. అన్ని కీలక ప్రదేశాలలో స్వచ్ఛమైన తాగునీరు, చక్కని పర్యావరణం మధ్య పరిశుభ్రమైన ఆహారం లభ్యతను నిరంతరం అందుబాటులో ఉంచాలన్నారు.
ఈ ఏడాది జరగనున్న రథ యాత్ర భద్రతా ప్రణాళికను రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా ఆవిష్కరించారు. యాత్ర సందర్భంగా సమగ్ర పూరీ పట్టణం 5 అంచెల భద్రతా వలయంలో ఉంటుందన్నారు. 10,000 మందికి పైగా భద్రతా సిబ్బంది ఈ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారు. యాత్ర పర్యవేక్షణ కోసం 275 కృత్రిమ మేధసు (ఏఐ) కెమెరాలు, ట్రాఫిక్ మరియు జన సమూహ నియంత్రణ కోసం డ్రోన్ నిఘా, తాజా ట్రాఫిక్ నవీకరణలు మరియు రూట్ మ్యాప్ల కోసం చాట్బాట్ యాప్. తక్షణ ప్రతిస్పందన బృందాలు, ఉగ్రవాద వ్యతిరేక బృందాలు, మైరెన్ పోలీసులు, నేవీ కోస్ట్ గార్డ్ ఉమ్మడి గస్తీ కార్యకలాపాల్లో పాల్గొంటారు. వాహనాల రాకపోకలకు అనుకూలంగా యాత్ర పరిసరాల్లో 26 చోట్ల ప్రత్యేక పార్కింగ్ జోన్లను గుర్తించారు. అంబులెన్స్లకు నిరంతరాయ రవాణా కోసం గ్రీన్ కారిడార్ నిర్ధారించారు.
రథయాత్ర తుది సన్నద్ధత సమీక్ష సమావేశం
రథ యాత్రకు 365 ప్రత్యేక రైళ్లు
శ్రీ జగన్నాథుని రథం యాత్ర కోసం తూర్పు కోస్తా రైల్వే 365 ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాలు, ఆంధ్ర ప్రదేశ్లోని విశాఖపట్నం, పలాస, జగదల్పూర్ గోండియా (ఛత్తీస్గఢ్), పశ్చిమ బెంగాల్లోని సంత్రాగచ్చి (కోల్కతా) ప్రాంతాల అనుసంధానంతో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని ప్రకటించారు.

రథయాత్ర నిర్వహణ పవిత్ర బాధ్యత: సీఎం

రథయాత్ర నిర్వహణ పవిత్ర బాధ్యత: సీఎం

రథయాత్ర నిర్వహణ పవిత్ర బాధ్యత: సీఎం