
‘పేపర్ మిల్లు ఉద్యోగుల వేతనాలు చెల్లించాలి’
కొరాపుట్: జయపూర్లోని ఏఈఆర్పిల్ యూనిట్ సేవా పేపర్ మిల్ ఉద్యోగుల వేతనాలు చెల్లించాలని మాజీ మంత్రి రబి నారాయణ విజ్ఞప్తి చేశారు. ఆదివారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ వి.కీర్తి వాసన్తో పేపర్ మిల్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. సమావేశంలో రబినందో పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇంతవరకు నాలుగు సార్లు పేపర్ మిల్ని క్రయ విక్రయాలు జరిపారన్నారు. మిల్లో ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పిన యాజమాన్యాలు ప్రభుత్వం నుంచి రుణాలు పొంది కార్మికుల కష్టాలు పట్టించుకోలేదన్నారు. ఈ విడత పేపర్మిల్ని కొనుగోలు చేసిన ఏ సంస్థ అయినా ముందుగా కార్మికుల వేతనాలు చెల్లించాని విజ్ఞప్తి చేశారు. గత ఏడాది ఆగస్టు నుంచి వేతనాలు ఇవ్వడం లేదని, అంతకు ముందు మూడు విడతలుగా వేతనాలు బాకీ ఉన్నారని, 2016 నుంచి బోనస్ పక్కన పెట్టారని, అనేక బాకీలు ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు వేతనాలు అందని 41 మంది కార్మికులు చనిపోయిన విషాదకర పరిస్థితి ఉందని కలెక్టర్కి వివరించారు. మరికొన్ని రోజులు ఆగితే మిల్లులో కార్మికుల ఆకలి కేకలు మరింతగా వినిపిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో బిల్ట్ సేవా పేపర్ మిల్ ఎంప్లాయిస్ యునియన్, బాలార్పూర్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు, సీనియర్ ఉద్యమ నాయకులు ప్రమోధ్ మహంతి తదితరులు పాల్గొన్నారు.

‘పేపర్ మిల్లు ఉద్యోగుల వేతనాలు చెల్లించాలి’