
భూగర్భంలో తయారీ..
స్థానిక బొడొ ఒడియా మఠం ఫులురి మూలిక ఔషధ తైలం సిద్ధం చేస్తుంది. ఈ ప్రత్యేక తైలం పలు ఔషధీయ వన మూలికలు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. ఏడాది పొడవునా భూగర్భంలో మట్టి పాత్రలో మూత వేసుకుని భగవంతుని ఆరోగ్యం కోసం దివ్య ఔషధంగా సిద్ధం చేస్తారు. ఏటా హేరా పంచమి నాడు ఫులురి తైలం పలు వన మూలికలు ఇతరేతర ఔషధీయ విలువలతో కూడిన సుగంధ ద్రవ్యాల మేళవింపుతో భూగర్భంలో చోటు చేసుకుంటుంది. స్థానిక ఒడియా మఠం ఈ సన్నాహాల్ని ఏడాది ముందుగా ప్రారంభించి స్వామి కోసం దివ్యమైన తైలం సిద్ధం చేసి ఏటా క్రమం తప్పకుండా జగతి నాథుని గోప్య సేవకులకు అందజేస్తారు. తరతరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఫులురి వన మూలికల ఔషదీయ తైలం పూతతో మూల విరాటులు ఒళ్లునొప్పుల నుంచి ఉపశమనం పొంది మెల్లగా కోలుకుంటారు. అంచెలంచెలుగా స్వామి చికిత్సలో ప్రాచీన ఔషధీయ పదార్థాల్ని జోడించి చికిత్స చేసి మూల విరాటుల్ని యాత్రకు సిద్ధం చేస్తారు. జ్వరం అనుబంధ అస్వస్థతతో బాధపడుతున్న స్వామికి అన్న ఆహారాలు నివారించి కషాయం వంటి పత్యం నైవేద్యాలు సమర్పించి గోప్య ఉపచారాలు నిర్వహించడంలో దైతపతి సేవకులు తలమునకలయ్యారు. అతి త్వరలో స్వామి ఆరోగ్యం కోలుకుంటుందనే ఆరాటంతో శ్రమిస్తున్నారు.