
టోల్గేటు వద్ద ఉద్రిక్తత
కాశీబుగ్గ: పలాస మండలం లక్ష్మీపురం టోల్గేటు లో పోలీసులతో కలిసి సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని రాష్ట్ర లారీ ఓనర్ల అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. వారంతా కలిసి గురువా రం నిరసన కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. వివరాల్లోకి వెళ్తే.. పలాస మండలం లక్ష్మీపురం జాతీయ రహదారి టోల్గేటు వద్దకు బుధవారం కాకినాడకు చెందిన లారీ వచ్చింది. లారీ ఓవర్ లోడుతో ఉందని, అదనంగా డబ్బులు కట్టాలని టోల్ సిబ్బంది కోరగా.. ఏ టోల్ప్లాజాలో లేని ఓవర్ లోడ్ లక్ష్మిపురం టోల్ప్లాజాలో ఎలా ఉందని డ్రైవర్ రమేష్ లంకా ప్రశ్నించారు. దీంతో అదనంగా చెల్లిస్తేనే విడిచిపెడతామని లేకుంటే విడిచిపెట్టబోమని వాహనాన్ని అడ్డుకున్నారు. అదనంగా ఉంటే అపరాధ రుసుం చెల్లిస్తామని డ్రైవర్ చెప్పినా వినకుండా డ్రైవర్పైకి కొట్టడానికి వెళ్లడంతో ఆయన 112కు కాల్ చేసి పోలీసుల సహకారం కోరారు. కాశీబుగ్గ పోలీసులు సైతం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నారని స్టేషన్కు తీసుకుని వెళ్లారు. కానీ పరీక్షలో తాగలేదని తేలడంతో విడిచిపెట్టి టోల్ప్లాజా వద్ద గొడవ చేశారని పోలీసులు రూ.1030 అపరాధ రుసుం కట్టించుకున్నారు. దీనిపై డ్రైవర్ స్పందిస్తూ తన తప్పు లేకున్నా టోల్గేటు సిబ్బంది అదనంగా డబ్బులు అడుగుతున్నారని, పోలీసులను సంప్రదిస్తే వారు కూడా టోల్ సిబ్బందికే సహకరించారని తెలిపారు. దీనిపై అసోసియేషన్ సభ్యులకు సమాచారం అందించడంతో గురువారం ఉదయం లక్ష్మిపురం టోల్ప్లాజా వద్దకు వందలాది లారీలకు సంబంధించిన వివిధ అసోషియేషన్ సభ్యులు చేరుకున్నారు. టోల్ప్లాజాలో డిస్ప్లే లేకుండా అదనపు బరువు చెబుతూ అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇవ్వని వారిపై దాడి చేయడానికి వస్తున్నారని, బరువు తూయకుండా అదనపు లోడ్ అని డబ్బులు తీసుకుంటే ఎలా ఇస్తామని ప్రశ్నించారు. మీడియా, కాశీబుగ్గ పోలీసుల సమక్షంలో లారీ బరువు తూయగా అదనపు లోడ్ లేదని తేలడంతో టోల్ప్లాజా సిబ్బంది, అధికారులను నిలదీశారు. తక్షణమే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టి లక్ష్మీపురం టోల్ప్లాజా కాంట్రాక్ట్ రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా లారీలు సరుకు రవాణాతో ఉపాధి పొందుతుంటే ఈ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడానికి చూస్తోందని ఆరోపించారు.