
ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట వయో పరిమితి పెంపు
భువనేశ్వర్:
ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో 5 ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించడానికి గరిష్ట వయోపరిమితిని 32 నుంచి 42 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. వివిధ నియామక పరీక్షలలో పాల్గొనడానికి అభ్యర్థులకు తగినంత అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించిన మేరకు గరిష్ట వయోపరిమితిని 32 నుంచి 42 ఏళ్లకు పెంచాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.
ఉద్యోగ భర్తీ పురస్కరించుకుని నిర్ధిష్ట వయోపరిమితి సూచిస్తే ఈ పెంపు వర్తించదు. పోలీసు, అగ్నిమాపక సేవలు, అబ్కారి సేవలు మొదలైన యూనిఫామ్ నియామక నియమాల్లో శారీరక సామర్థ్య పరీక్ష సూచించన సందర్భాల్లో వర్తించదు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా షెడ్యూల్డు కులాలు, తెగలు, ఎస్ఈబీసీ, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు విషయంలో పైన పేర్కొన్న గరిష్ట వయోపరిమితి మరింత సడలింపును కలిగి ఉంటుందని పేర్కొన్నారు.
కృత్రిమ మేధస్సు (ఏఐ) విధానం – 2025 మంత్రి మండలి ఆమోదించింది. దీంతో రాష్ట్రంలో ఏఐ మిషన్, ఏఐ సెల్ ప్రారంభిస్తారు. ఈ రంగంలో స్టార్టప్లను ప్రోత్సహిస్తారు. పాలనను మెరుగుపరచడానికి, ఆవిష్కరణలను ప్రేరేపించడానికి, డేటా ఆధారిత నిర్ణయం మెరుగుదల, సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రోత్సాహానికి కృత్రిమ మేధస్సు సామర్థ్యం ఉపయోగించుకునే దిశలో ఇదో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఢెంకనాల్ జిల్లా జొరండా ప్రాంతంలో మహిమా గద్దె ప్రాంగణం అభివృద్ధి పనులు, శూన్య మండపం నిర్మాణానికి ఆమోదం తెలిపారు. 36 నెలల్లోపు ఈ పనులు పూర్తి చేయాలని మంత్రి మండలి ఆదేశించింది. జగత్సింగ్పూర్లోని జేఎస్డబ్ల్యూ తన సొంత జెట్టీని నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు జేఎస్డబ్ల్యూ మధ్య కుదిరిన ఒప్పందాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ఈ చర్యతో రాష్ట్రంలో 3,450 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అందుబాటులోకి వస్తుంది. ఒడిశా నేత్ర సంరక్షణ సేవల కోసం 141 కొత్త పోస్టుల సృష్టి, 200 పోస్టుల అప్గ్రేడ్ ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది.