
కనీస వేతనాలు పెంచాలి
● అంగన్వాడీ, ఆశవర్కర్లు, హెల్పర్ల డిమాండ్ ● ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన
పర్లాకిమిడి: కనీస వేతనాలను పెంచాలని స్కీం వర్కర్లు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, మధ్యాహ్నన భోజన వర్కర్లు డిమాండ్ చేశారు. 45, 46వ జాతీయ కార్మిక సమ్మేళన సిఫారసుల మేరకు కనీస వేతానాలు ప్రభుత్వం పెంచాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకూ ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఐదో సర్వభారతీయ ప్రతిబాద్ దివాస్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో జిల్లాలోని అన్ని సమితుల నుంచి అంగన్వాడీ, ఆశవర్కర్లు, ఎండీఎం హెల్పర్లు, ప్యూన్లు పాల్గొన్నారు. ధరల పెరుగుదల, కనీస వేతానాల తలసరి ఆదాయం మేరకు ఇప్పుడున్న వేతనాలపై కనీసం 20 నుంచి 25 శాతం పెంచాలని ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ రంజన్ కుమార్ మహాపాత్రో కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను కలెక్టర్ బిజయ కుమార్ దాస్కు తన చాంబర్లో అందజేశారు. ఏఐటీయూసీ నాయకులు ఉపేంద్రనాయక్, రాష్ట్రసంయుక్త కార్యదర్శి గీతాంజలి ఖోండో పాత్రో, మోహానా బ్లాక్ నుంచి అంగన్వాడీ వర్కర్ల సంఘం అధ్యక్షురాలు సంగీత నాయక్, కార్యదర్శి సుజాతా నాయక్, ఆర్.ఉదయగిరి నుంచి అధ్యక్షురాలు సస్మితా మిశ్రా, కార్యదర్శి జ్యోత్సనారాణి జెన్నా, నువాగడ బ్లాక్ నుంచి జైమన్ కార్జి, కార్యదర్శి సుస్మితా బోడోరైతో, రాయగడ బ్లాక్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంటు మమతా, కార్యదర్శి నిరంజన్, గజపతి మోటారు వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నర్సింగో మాలబిశోయి, కార్యదర్శి డి.జగన్నాథరావు పాల్గొన్నారు.