
చాందీపూర్, తలసరి బీచ్లకు మహర్దశ
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా కోస్తా ప్రాంతాల పర్యాటక అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యాటక శాఖ మంత్రి ప్రభాతి పరిడా బాలాసోర్ జిల్లాలో పలు పర్యాటక ఆకర్షణీయ ప్రాంతాల్లో అనుకూల వనరులపై వైమానిక సర్వే నిర్వహించారు. జిల్లాలో తొలొసొరా, చాందీపూర్ రెండు ప్రధాన సాగర తీరాలు. విశేష సంఖ్యలో పర్యాటకుల్ని ఈ తీరాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రాంతాల్లో చక్కటి పర్యావరణ పురోగతితో సందర్శకులకు అనుకూలమైన వసతి, మనోరంజక, కాలక్షేప వసతులు సమకూర్చితే అద్భుతమైన పర్యాటక కేంద్రాలుగా వెలుగొందుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
బాలాసోర్ జిల్లాలో బీచ్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆమె ప్రత్యక్షంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ రెండు ప్రధాన బీచ్లు తొలొసొర, చాందీపూర్ ప్రధాన పర్యాటక కేంద్రాలుగా మలిచే లక్ష్యంతో గణనీయమైన ఆర్థిక కేటాయింపులు, పర్యాటక కార్యక్రమాలను మంత్రి ప్రతిభా పరిడా ప్రకటించారు. ఆసియాలోనే అతిపెద్ద శివలింగానికి నిలయమైన భుషండేశ్వర్ పీఠం ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను పెంచడానికి రూ.10 కోట్ల గ్రాంట్ ప్రకటించారు.
సాగర తీరాలకు రూ. 11 కోట్లు
పర్యాటకులకు అనుకూలమైన ప్రసిద్ధ తీరప్రాంత గమ్యస్థానమైన చాందీపూర్ బీచ్ సమగ్ర అభివృద్ధికి మంత్రి రూ. 11 కోట్లు కేటాయించారు. ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందడం లక్ష్యంగా పేర్కొన్నారు. పర్యావరణ పర్యాటక రంగానికి ప్రోత్సాహకంగా, ఈ సంవత్సరం బాలసోర్ తీర ప్రాంతంలో ఎకో రిట్రీట్ను ఏర్పాటు చేయాలనే ప్రణాళికలను ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. సుస్థిర, ప్రకృతి కేంద్రీకృత అనుభవాలను కోరుకునే పర్యాటకులను ఆకర్షించడం ఈ చొరవ లక్ష్యం. జిల్లాలోని వివిధ బీచ్లలో మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు పురోగతి దశలో ఉన్నాయి. ఈ తీరాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, అధిక సంఖ్యలో సందర్శకులను ఆకర్షించడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని మంత్రి అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా బీచ్ల ప్రస్తుత స్థితిని అంచనా వేయడానికి మంత్రి హెలికాప్టర్ ద్వారా వైమానిక సర్వే నిర్వహించారు. అనంతరం ఆమె పర్యాటక శాఖ కమిషనర్ కమ్ సెక్రటరీ బల్వంత్ సింగ్తో పాటు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. ఈ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధిని వేగవంతం చేయడంపై ప్రాధాన్యత పెంపొందించారు. సాగర తీరాల బహుముఖ అభివృద్ధి పర్యాటక రంగం బహుముఖ అభివృద్ధితో సమాజంలో సన్నకారు, బలహీన తదితర వర్గాలకు అనేక ఉపాధి అవకాశాల్ని అందుబాటులోకి తెస్తాయని మంత్రి తెలిపారు.