వడగాడ్పులపై ఆరోగ్య శాఖ సమగ్ర సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

వడగాడ్పులపై ఆరోగ్య శాఖ సమగ్ర సన్నాహాలు

Apr 30 2025 5:11 AM | Updated on Apr 30 2025 5:11 AM

వడగాడ్పులపై ఆరోగ్య శాఖ సమగ్ర సన్నాహాలు

వడగాడ్పులపై ఆరోగ్య శాఖ సమగ్ర సన్నాహాలు

భువనేశ్వర్‌: రాష్ట్రంలో వేసవి తాపం విపరీతంగా పెరుగుతోంది. తెల్లారితే గడప దాటడం కష్టతరమవుతోంది. ఈ నేపథ్యంలో వడగాడ్పుల ప్రభావంతో వడదెబ్బ ప్రమాదాల తీవ్రత పట్ల రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అప్రమత్తమైంది. వడగాడ్పుల సమర్థమైన నిర్వహణతో అవాంఛనీయ సంఘటనల నివారణకు విభాగం ప్రాధాన్యత కల్పించింది. ఆరోగ్య శాఖాపరమైన ఏర్పాట్లతో సాధారణ ప్రజానీకంలో అవగాహన పెంపొందించాలనే దృక్పథంతో పరిస్థితుల్ని సమీక్షించారు.

రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ ముఖేష్‌ మహాలింగ్‌ ఆదేశాల మేరకు వడగాడ్పుల నిర్వహణతో వడదెబ్బ ప్రమాదాల నివారణ కోసం అవసరమైన కార్యాచరణ, అనుబంధ ఏర్పాట్లు క్రమబద్ధీకరణకు ప్రజారోగ్య (డీపీహెచ్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ నీలకంఠ మిశ్రా అధ్యక్షతన మంగళవారం సమీక్షా సమావేశం జరిగింది. వడ గాలుల ప్రభావాలను తగ్గించడానికి ఇంట్రావీనస్‌ ద్రవాలు, ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్స్‌ (ఓఆర్‌ఎస్‌), మందులు, ఎయిర్‌ కూలర్లు, పవర్‌ బ్యాకప్‌ వ్యవస్థలు వంటి అవసరమైన వైద్య సామగ్రి నిరంతర లభ్యతను నిర్ధారించడానికి శాఖ కృషి చేస్తోందని తెలిపారు. వడదెబ్బ సంబంధిత బాధితుల సత్వర చికిత్స, వైద్యం కోసం ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో తగినన్ని పడకలు ముందస్తుగా సిద్ధం చేయాలని రాష్ట్రంలో 30 జిల్లాలకు ఆదేశాలు జారీ చేశారు. వడగాడ్పుల నిర్వహణపై దృష్టి సారించి సంబంధిత అనారోగ్యాలను నిర్వహించడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఈ కార్యాచరణ కోసం ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు ఆరోగ్య శాఖ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ శిక్షణలో ఆరోగ్య సంరక్షణ నిపుణులు మాత్రమే కాకుండా, స్థానిక ఆరోగ్య కార్యకర్తలు, సాధారణ ప్రజానీకానికి వేసవి తాపం సంబంధిత ఆరోగ్య సమస్యలకు త్వరగా మరియు సమర్థవంతంగా స్పందించడానికి వీలుగా శిక్షణ కల్పిస్తారు. దీనితో పాటు, వేడిగాలులతో సంబంధం ఉన్న ప్రమాదాల గురించి అవగాహన పెంచడానికి, వేడి సంబంధిత అనారోగ్యాలను నివారించడంపై ప్రజలకు ఆచరణాత్మక సలహాలను అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా సమాచార, విద్య, కమ్యూనికేషన్‌ (ఐఈసీ) ప్రచారం తీవ్రతరం చేస్తారు. తీవ్రమైన వేడి ప్రభావాన్ని తగ్గించడానికి సకాలంలో వైద్య సహాయం అందించడం, అవగాహన పెంచడం, అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, వనరులు అందుబాటులో ఉన్నాయని సమీక్ష సమావేశంలో అధికారులు హామీ ఇచ్చారు. వేడి సంబంధిత వ్యాధుల నోడల్‌ అధికారి డాక్టర్‌ బసంత్‌ ప్రధాన్‌, రాష్ట్ర నిఘా అధికారి డాక్టర్‌ అశోక్‌ పాయిక్రాయ్‌, నర్సింగ్‌ అదనపు డైరెక్టర్‌ డాక్టర్‌ సెఫాలి మల్లిక్‌, డీఎఫ్‌డబ్ల్యూ అదనపు డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రతిభా ప్రధాన్‌, అన్ని జిల్లాల నుండి ప్రధాన జిల్లా వైద్య అధికారులు (సీడీఎంఓలు) వ్యక్తిగతంగా, వర్చువల్‌ మోడ్‌ ద్వారా ఈ సమావేశానికి హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement