
విమానాశ్రయంలో చిక్కుకున్న ప్రయాణికులు
భువనేశ్వర్: స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. 12 గంటలు గడిచినా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోలేకపోయారు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు విమానాశ్రయం గేట్ల ముందు గందరగోళం సృష్టించారు. వాతావరణం సమస్యల కారణంగా శనివారం రాత్రి ఢిల్లీ నుంచి కోల్కతాకు వెళ్లాల్సిన ఒక ప్రైవేట్ ఎయిర్లైన్స్ విమానం అత్యవసరంగా స్థానిక విమానాశ్రయంలో ఆగింది. వాతావరణం మెరుగుపడినప్పటికీ ఆ విమానయాన సంస్థల విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించలేదనే ఆరోపణతో ప్రయాణికులు నిరసన ప్రదర్శించారు. వాతావరణ మార్పు కారణంగా 8 విమానయాన సంస్థల విమానాలు స్థానిక విమానాశ్రయంలో నిలిచి పోయాయి. వాతావరణం కుదుట పడిన తర్వాత 6 విమానాలు తమ ప్రయాణికులతో పాటు గమ్య స్థానాలకు బయల్దేరాయి. మిగిలిన రెండు విమానాలు బయల్దేరక పోవడంతో ఉద్రిక్తత నెలకొంది. 12 గంటలకు పైగా చిక్కుకుపోయిన తర్వాత ప్రయాణికులు సమస్యలను ఎదుర్కొనడంతో గొడవకు దిగారు. ఆగ్రహించిన ప్రయాణికులను విమానాశ్రయ అధికారులు బుజ్జగించి శాంతింప జేశారు. ప్రయాణికులను త్వరగా బయలుదేరేలా హామీ ఇచ్చి కోల్కతాకు తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేశారు.