
సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ
జయపురం: కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ ఉద్యోగుల సంఘం వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. సమస్యలు పరిష్కరించాలని కేసీసీ బ్యాంక్ ఉద్యోగులు పట్టణ ప్రధాన మార్గాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. హోటల్ ఉడ్ నుంచి ప్రారంభించన ర్యాలీ బ్యాంక్ ప్రధాన కార్యాలయానికి చేరింది. కార్యాలయ సభాగృహంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సాధారణ కార్యదర్శి కామ్రెడ్ కె.వి.ఎస్ రవికుమార్ పాల్గొన్నారు. యూనియన్ పతాకాన్ని ఎగురవేశారు. బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ జయపురం అధ్యక్షుడు దిగంబర నాయక్ ఉద్యోగుల సమస్యలపై ప్రసంగించారు. సాధారణ కార్యదర్శి అరుణ కుమార్ సాహు యూనియన్ వార్షిక నివేదికను సభకు సర్పించారు. కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వర చంద్ర పాణిగ్రహి, సీనియర్ డైరెక్టర్ రమాకాంత రౌళోలు ప్రసంగిస్తూ.. బ్యాంక్ ఉన్నతికి ఉద్యోగులు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమన్నారు. వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సాధారణ కార్యదర్శి కామ్రెడ్ కె.వి.ఎస్.రవికుమార్, సహాయ కార్యదర్శి అఖిల ఒడిశా సహకార బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ సాధారణ కార్యదర్శి ప్రభోద్ కుమార్ మిశ్ర, ప్రెసిడెంట్ సంజీవ్ పతి, కార్యదర్శి బిష్ణు ప్రసాద్ మహాపాత్రో తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించారు.