కొరాపుట్: రాగి జావతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మంత్రి నిత్యానంద గొండో తెలిపారు. మంగళవారం తన సొంత నియోజకవర్గం నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కోట్ పట్టణం 12వ వార్డులో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పర్యటించారు. దీనిలో భాగంగా ఎండ వేడిమికి సమీపంలో ఉన్న దళిత మహిళ ఇంటి అరుగుపై సేద తీరారు. ఇంట్లో అంబలి ఉంటే ఇవ్వాలని ఆమెను కోరారు. దీంతో వెంటనే ఆ మహిళ తన ఇంట్లో ఉన్న అంబలి గ్లాస్ ఇవ్వగా మంత్రి ఆరగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అంబలి తాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మిలెట్స్ వ్యవసాయం, ఉత్పత్తి, మార్కెటింగ్కి అధిక ప్రోత్సాహమిస్తున్నట్లు తెలియజేశారు. ఒకప్పుడు పేదల ఆహారమైనటువంటి అంబలి, నేడు అందరి ఆహారంగా మారిందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా అంబలి ప్రాముఖ్యం పొందిందన్నారు.