విక్రమదేవ్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
జయపురం: శనివారం విడుదలైన +3 పరీక్షా ఫలితాలలో జయపురం విక్రమదేవ్ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. సైన్స్ విభాగంలో 72 శాతం, ఆర్ట్స్ విభాగంలో 68 శాతం, కామర్స్ విభాగంలో 55 శాతం ఫలితాలు సాధించారు. ప్రథమ శ్రేణిలో 48 మంది, ద్వితీయ శ్రేణిలో 100 మంది పాసయ్యారు. పీజీ ఫలితాలలో 89 శాతం ఫలితాలు సాధించారు. ఆర్ట్స్లో బిజేత మోణి, సైన్స్లో టి.సాయిదీక్ష, కామర్స్లో జి.శశాంకరాజ్లు టాపర్లుగా నిలిచారు.
పొంచి ఉన్న ప్రమాదం
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా నందాహండి సమితి సొరుగుడ వద్ద కాలువపై ఇనుప వంతెన ప్రమాదకరంగా మారింది. పైభాగంలో ప్లేట్లకు బోల్టులు ఊడిపోతున్నాయి. దీంతో ప్లేట్లు వదులుగా మారడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ప్లేట్లు సరిచేయాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
ముఖలింగేశ్వరుని
కల్యాణోత్సవం ప్రారంభం
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో జ్యేష్ట మాసం ఆదివారం మొదటి రోజు రాత్రి శ్రీముఖలింగేశ్వర సహిత వారాహి అమ్మవారి పాంచరాత్రి కల్యాణ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ముందుగా గణపతి పూజతో ప్రారంభమై ఘనంగా ధ్వజారోహణ జరిగింది. పుణ్యాహవచనం, మంటపారాధన, బలిహరణ నిర్వహించి మంగళం పలికారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ప్రభాకరరావు, అర్చకులు, చలం, నాయుడుగారి రాజశేఖర్, శ్రీకృష్ణ శివాజీ తోపాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
‘రైతులకు సరిపడా విత్తనాలు అందించాలి’
కాశీబుగ్గ: రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు తక్షణమే సరఫరా చేయాలని, అందులో సబ్సిడీ వర్తించేలా చర్యలు చేపట్టాలని అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు మామడి భీమారావు అన్నారు. మందస మండలం రట్టి గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైందని, రైతులకు సరిపడా విత్తనాలు ఏ రకం అ వసరమో ఆర్బీకేల్లో సమాచారం ఉందని, అదేవిధంగా విత్తనాలు అందించాలని కోరారు. కొత్త ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్రకా రం వ్యవసాయ పెట్టుబడులకు రూ.20వేలు తక్షణమే రైతుల ఖాతాల్లో వేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో జీడి పిక్కల కొనుగోలు జరగడం లేదని, గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. కాలువలు మరమ్మతు చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతులు నారాయణ, గురయ్య, సూర్యనారాయణ పాల్గొన్నారు.
యూబీ ఉద్యోగులపై
దాడి
రణస్థలం: మండలంలోని యునైటెడ్ బ్రూవరీస్ పరిశ్రమ ఉద్యోగులపై దాడి చేసిన ఘటనలో 10మందిపై యూబీ యాజమాన్యం ఫిర్యాదు చేసిందని జేఆర్ పురం ఎస్ఐ కె.గోవిందరావు తెలిపారు. ఫిర్యాదులో తెలిపిన వి వరాలు ప్రకారం.. యూబీ పరిశ్రమ యూనిట్ హెడ్ డి.రామకృష్ణ, ఉద్యోగులు ఎం.ఎల్ రావు, బి.రవికుమార్, కె.అప్పలరెడ్డి, జి. క్రిష్ణంరాజు, టి.ఈశ్వరరావులపై శనివారం మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో దాడి జరిగింది. ఎన్బీఎస్, టీఎఆర్, ఎంఎన్ఆర్ కాంట్రాక్టర్లు టి.అప్పారావు, ఎస్.గంగులు, కె.మహాలక్ష్మి, వై.చిన్నారావు, కాకి చిన్నారావు, ఎన్.ఈశ్వర రావు, ఎస్.వెంకటరమణ, ఎన్.లక్ష్మణరావు, కె.బలరాం, వై. మహాలక్ష్మిలు దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీళ్లతో పాటు మరో 40 మంది వరకు లోపల కార్మికులు, బయట వ్యక్తులు పరిశ్రమ గేటు నుంచి లోపలకి ప్రవేశించారని తెలిపారు. ఈ ఘటనపై ఇంకా కేసు నమోదు చేయలేదని ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నామని జేఆర్ పురం ఎస్ఐ కె.గోవిందరావు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment