అమ్మవారి దర్శనానికి బయలుదేరిన వైఎస్సార్ సీపీ ప్రభలు
శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చినతిరునాళ్లలో నాల్గవ రోజు శనివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారు జాము నుంచే భక్తులు మునేరులో స్నానాలు చేసి పాలు, పొంగళ్లతో అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ క్యూలైన్లతో పాటు పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. అమ్మవారి పుట్టినిల్లు అనిగండ్లపాడుతో పాటు మండలంలోని ముచ్చింతాల, వెంకటాపురం, గుమ్మడిదుర్రు, శివాపురం గ్రామాల నుంచి ఎడ్లబండ్లతో పాటు చిన్న దూడలు, గొర్రెలతో బండ్లు కట్టి వాటిలోను, సైకిళ్లకు, ఆటోలకు, ట్రాక్టర్లకు పార్టీ జెండాలు, ప్రభలు కట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మునేరులో పెద్ద ఎత్తున గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. భక్తులు రాత్రి సమయంలో ఆలయ ప్రాంగణంలో సేద తీరారు. ఎగ్జిబిషన్ వద్ద భక్తుల కోలాహలం కనిపించింది. భక్తులకు వేద సీడ్స్ వారు మజ్జిగ పంపిణీ చేయగా రామ్కో సిమెంట్స్ వారు పులిహోర పంపిణీ చేశారు.
– పెనుగంచిప్రోలు


