మమ..అనిపించారు! | - | Sakshi
Sakshi News home page

మమ..అనిపించారు!

Dec 5 2025 6:02 AM | Updated on Dec 5 2025 6:02 AM

మమ..అ

మమ..అనిపించారు!

రైతన్నా మీ కోసం గొప్పల కోసమే

ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొక్కుబడి తంతుగా రైతన్నా మీకోసం కార్యక్రమం ఏడాదిన్నర పాలనలో పండగ లాంటి వ్యవసాయాన్ని దంగడలా చేశారు ధాన్యం, పత్తి కొనుగోళ్ల పైన రైతుల్లో తీవ్ర అసంతృప్తి కాలువల నిర్వహణ గాలికొదిలేసిన ప్రభుత్వం రైతుల ఎదుట పడే ధైర్యం లేక ముఖం చాటేసిన ప్రజాప్రతినిధులు

ముఖం ఎందుకు చాటేశారంటే...

‘రైతన్నా’ మీకోసం అట్టర్‌ ఫ్లాప్‌

ప్రచారం కోసం పాకులాడుతున్నారు

రైతన్నా..మీకోసం పేరుతో చంద్రబాబు ప్రభుత్వం మరో డ్రామాకు తెరతీసింది. వైఎస్సార్‌ సీపీ పాలనలో పండగ లాంటి వ్యవసాయాన్ని ఈ ఏడాదిన్నర పాలనలో దండగలా మార్చి చంద్రబాబు తన మార్కు పాలన మళ్లీ రైతులకు చవిచూపించాడు. వరి, మిర్చి, పత్తి, వేరుశనగ, అరటి, టమోటా ఇలా ఏ రైతును కదిపినా కన్నీటి సంద్రమే. ఆర్‌బీకే వ్యవస్థను నీరుగార్చి, పంటల బీమాకు ఎసరు పెట్టి, ప్రకృతి వైపరీత్యాలకు పరిహారం ఊసే మరిచిన బాబు ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకుని రైతన్నా..మీకోసం అంటూ వస్తుందని రైతులు తూర్పారపడుతున్నారు. రైతుల ఎదుట పడే ధైర్యం లేక అధికారులు, ప్రజాప్రతినిధులు ఏదో మొక్కుబడిగా కార్యక్రమం కానిచ్చి చేతులు దులుపుకొన్నారు.

నష్టపోయిన రైతులకు మేలు చేయడం చేతకాదు కానీ రైతన్నా మీ కోసం అంటూ గొప్పులు చెప్పుకోవడానికి బయలుదేరారు. నేను గత ప్రభుత్వంలో కౌలు రైతుగా రైతు భరోసా అందుకున్నాను. పత్తి పంట నష్టపోతే రెండు విడతలుగా రూ.80వేలు వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చాక కౌలు రైతుగా రైతు భరోసా లేదు. ఈ ఏడాది నాలుగున్నర ఎకరాలు పత్తి సాగు చేసి నష్టపోయాను.

–రమావతు శ్రీను, రైతు, మునగపాడు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టిన ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొక్కుబడిగా సాగింది. ఏడాదిన్నర పాలనలో రైతులకు చేసింది ఏమీ లేదు. పైగా విపత్తుల వేళ ఆదుకోకుండా గాలికి వదిలి వేశారు. దీంతో ఎక్కడ నిలదీస్తారోననే భయంతో రైతుల ముందుకు వెళ్లే ధైర్యం లేక మంత్రి, ఎమ్మెల్యేలు ముఖం చాటేశారు. రైతుల నుంచి ప్రతిఘటన తప్పదని భావించిన ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని తమతమ నియోజకవర్గాల్లో తూతూ మంత్రంగా నిర్వహించి మమ అనిపించారు. సాక్షాత్తూ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఘంటశాలలో రైతన్నా...మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నా, రైతులతో కలిసి నేరుగా మమేకం కాకుండా, వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి వెళ్లారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రజా ప్రతినిధులు, ప్లకార్డులు, కరపత్రాలు పట్టుకుని ఫొటోకు ఫోజులు ఇచ్చి తంతు ముగించారు. గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల వద్దకు తమ సానుభూతిపరులను పిలిపించుకుని ఫొటోలు దిగి మమ అనిపించారు. ఏపీఏఐఎంఎస్‌ (ఏపీ వ్యవసాయ, సమాచార, నిర్వహణ వ్యవస్థ )యాప్‌ను రైతుల ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసే బాధ్యతను ఆర్‌ఎస్‌కే సిబ్బందికి అప్పగించారు. తొలిరోజు హడావిడి చేసినా... మరునాటి నుంచి ప్రజా ప్రతినిధులు పత్తా లేకుండా పోయారు. సిబ్బంది తమకున్న పరిచయాలతో కొంతమంది రైతులకు యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి మమ అనిపించారు.

పంచసూత్రాల్లేవ్‌...

‘‘నేను మీ రైతు బిడ్డనే రాష్ట్రంలోని ప్రతి కర్షకుడి కష్టం తెలుసు, మీతో కలిసి నడవడానికి, మీసమస్యలు పరిష్కరించడానికి, మీకు పూర్తిగా అండగా ఉండేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు నీటి మూటలే అయ్యాయి. రైతన్నా మీకోసం కార్యక్రమం విజయవంతం అయిందని గొప్పలు చెప్పుకోవడం తప్ప, క్షేత్ర స్థాయిలో ఆ కార్యక్రమం పూర్తిగా ఫెయిల్‌ అయిందనే భావన టీడీపీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది.

అధ్వానంగా పంట కాలువలు

పంట కాలువల్లో కనీసం తూటికాడ, పూడికతీత, మరమ్మతులు చేపట్టక పోవడంతో నీరు పుష్కలంగా ఉన్నా చివరి ఆయకట్టు రైతులు నీరందక ఇబ్బందులు పడ్డారు. పెడన, అవనిగడ్డ ప్రాంతంలో ఇంజిన్ల ద్వారా పంట పొలాలను తడుపుకొనే దుస్థితి నెలకొంది. పంటలకు కనీస మద్దతు ధర లబించటం లేదు. సబ్సిడీ విత్తనాలు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల వద్దకు వెళితే ఎక్కడ నిలదీస్తారోననే భయంతో ప్రజా ప్రతినిధులు ముఖం చాటేశారు.

మైలవరంలో

మైలవరం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు నామమాత్రంగా నిర్వహించారు. కేవలం రైతు భరోసా కేంద్రాల వద్ద ప్లకార్డులు ప్రదర్శించి, ఫొటోలకు ఫోజులిచ్చి మీడియాలో కథనాలను రాయించుకున్నారు తప్ప రైతుల వద్దకు వెళ్లనేలేదు. ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌ సైతం రైతుల వద్దకు వెళ్లకుండా మైలవరంలో ప్లకార్డులను ప్రదర్శించి వదిలేశారు.

తిరువూరులో

తిరువూరు నియోజకవర్గంలో రైతన్నా మీకోసం కార్యక్రమం మొక్కుబడి తంతుగా సాగింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఐదు గ్రామాల్లో పాల్గొన్నారు. రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సేవలను వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. టీడీపీ అనుకూలంగా ఉండే రైతుల వద్దకు మాత్రమే ఎమ్మెల్యే వెళ్లారు. తమకు రైతు భరోసా సొమ్ము రాలేదని పలువురు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అందరికీ ఈ పథకం కింద లబ్ధి చేకూరుస్తామని తెలిపారు.

జగ్గయ్యపేటలో

నియోజకవర్గంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. రైతుల వద్దకు వెళ్లి తాము చేసిన మంచిని వివరించే ధైర్యం లేక తమకు అనుకూలంగా ఉన్న రైతుల వద్దకు వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ఎక్కడా పాల్గొనక పోవడం గమనార్హం. రైతుల కష్టాలను తీర్చలేని ప్రభుత్వం పబ్లిసిటీ కోసమే చేపట్టిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నందిగామలో

రైతన్నా మీకోసం కార్యక్రమం నియోజకవర్గంలో మొక్కుబడిగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామలో మినహా నియోజకవర్గంలో ఎక్కడా రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొనలేదు. కేవలం వ్యవసాయ శాఖ అధికారులు మాత్రమే పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో రైతులు పాల్గొనకుండా కేవలం నేతల అనుయాయులు, టీడీపీకి చెందిన కొంతమంది మాత్రమే పాల్గొని ఆ కార్యక్రమాన్ని మమా.. అనిపించారు.

రైతులు పీకల్లోతు కష్టాల్లో ఉంటే ఆదుకోకుండా రైతన్నా మీ కోసం అంటూ తామేదో గొప్పగా చేసినట్లు ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. క్షేత్రస్థాయిలో రైతులు పడే కష్టాలను ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాలి.

–గొర్రెపాటి బుల్లియ్య,

చిల్లకల్లు, జగ్గయ్యపేట మండలం

ప్రధానంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. సంచులు, వాహనాల కొరత పట్టి పీడిస్తోంది. లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కల్లాల్లో, రోడ్లపైనే ఉండిపోయింది. దీనికితోడు దిత్వా తుపాను తోడవడంతో, వారం పదిరోజులుగా ధాన్యపు రాసులు అలానే ఉండిపోయాయి. ధాన్యం ఆరబెట్టే అవకాశం లేక పలు చోట్ల ధాన్యం బూజు పట్టి రంగు మారడంతో పాటు, కొన్ని చోట్ల మొలకలు సైతం వచ్చాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో పత్తి కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండటంతో, రైతుల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. కృష్ణా జిల్లాలో గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద 1,56,827 మంది రైతులకు లబ్ధి కలగ్గా, ప్రస్తుత ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ పథకం కింద 1.33 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరింది. ఎన్టీఆర్‌ జిల్లాలో గత ప్రభుత్వంలో 1.28 లక్షల మందికి లబ్ది కలుగగా, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అన్నదాత సుఖీభవ పథకం కింద 1.08 మందికి మాత్రమే మేలు చేకూరింది. అన్నదాత సుఖీభవ పథకంలో కూడ కోత విధించింది.

మమ..అనిపించారు! 1
1/2

మమ..అనిపించారు!

మమ..అనిపించారు! 2
2/2

మమ..అనిపించారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement