
గజిబిజి.. గందరగోళం!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీలు ఉమ్మడి కృష్ణాజిల్లాలో గజిబిజి గందరగోళంగా తయారయ్యాయి. జూన్ మాసంలో ప్రభుత్వం చేపట్టిన ఈ బదిలీల పర్వం ముగిసినప్పటికీ ఇంకా పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు అందుబాటులోకి రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఇంకా అనేక సమస్యలు వెంటాడుతున్నా ఇప్పటి వరకూ వాటిని పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టలేదని ఆయా సంఘాల నేతలు మండిపడుతున్నారు. బదిలీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం అమలు చేసిన నియమ నిబంధనలు మొదటి నుంచి గందరగోళంగా తయారు కావటంతో చివరి వరకూ ఉపాధ్యాయులు వాటిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చాలా రోజులు నిరసనలతో ఉపాధ్యాయులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయినా ఇంకా సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
వాటిని భర్తీ చేయరా?
ఉమ్మడి కృష్ణాజిల్లాలో సగానికి పైగా మండలాల్లో ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థల్లో భారీగా ఖాళీలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రెడ్డిగూడెం, చాట్రాయి, జి.కొండూరు, వత్సవాయి, జగ్గయ్య పేట, గంపలగూడెం ఇలా దాదాపుగా సగానికి పైగా మండలాల్లో ఉన్న విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవటంతో విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. విజయవాడ అర్బన్లోనూ మునిసిపల్ విద్యాసంస్థల్లో ఖాళీలు కనిపిస్తున్నాయి. ఇటీవల 150 మంది ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతి కల్పించటంతో ఆ మేర ఆయా పోస్టుల్లో భర్తీ చేయాల్సిన అధికారులు దృష్టి పెట్టకపోవటంతో ఖాళీలు అలాగే కొనసాగుతున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎస్జీటీ, ఎంటీఎస్ సిబ్బందికి సంబంధించి సుమారు ఐదారు వందల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది.
పోస్టింగ్ ఇచ్చినా బదిలీ కానీ వైనం..
ఉమ్మడి కృష్ణాజిల్లాలో అధికారులు పెద్ద సంఖ్యలో బదిలీలు నిర్వహించారు. అయితే ఉపాధ్యాయులు ప్రస్తుతం ఉన్న పాఠశాల నుంచి బదిలీ అయిన విద్యాసంస్థకు వెళ్లకుండా వందల సంఖ్యలో అక్కడే కొనసాగుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. బదిలీ అయిన చోటకు వేరే ఉపాధ్యాయుడు రాకపోవటంతో అక్కడి నుంచి పోస్టింగ్ ఇచ్చిన పాఠశాలకు వెళ్లలేక పలువురు ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు. ఈ విధమైన పరిస్థితులు ఉమ్మడి జిల్లాలోని చాలా మండలాల్లో దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా జిల్లా శివారు ప్రాంతాల్లో ఉన్న చాలా పాఠశాలల నుంచి బయటకు వచ్చిన ఉపాధ్యాయులు వారి స్థానంలో అక్కడకు వెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
భాషా పండితులు సమస్యలతో సతమతం..
తెలుగు భాషా పండితులు, అలాగే తెలుగు బోధించే ఇతర ఉపాధ్యాయుల మధ్య వివాదం కొనసాగుతోంది. దీనిపై వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో వారి బదిలీల విషయంలో సందిగ్ధం నెలకొంది. వీరిలో కొంతమందికి పోస్టింగ్ ఇచ్చినా మొత్తం మీద వివాదంతో గజిబిజిగా తయారైంది. ఉర్దూ ఉపాధ్యాయుల అంశంలోనూ ఆ సంఘ నేతలు సమస్యలు చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో టీచర్ల బదిలీల్లో అయోమయం సరైన కసరత్తు చేయకుండా బదిలీలు చేపట్టడంతో సమస్యలు ఇంకా సగానికి పైగా మండలాల్లో భర్తీ కాని ఖాళీలు పోస్టింగ్ ఇచ్చినా బదిలీ కాని వైనం అధికారుల తీరుపై మండిపడుతున్న ఉపాధ్యాయులు
సమస్యలు తక్షణం పరిష్కరించాలి
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి చాలా సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. దీని వల్ల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు సైతం అవస్థలు పడుతున్నారు. అధికారులు త్వరితగతిన సమస్యలను పరిష్కరించి ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూడాలి.
–ఎ.సుందరయ్య, ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్, ఎన్టీఆర్ జిల్లా
ప్రణాళిక లేకపోవటంతోనే సమస్యలు
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి సరైన ప్రణాళిక లేకపోవటంతో అన్ని మండలాల్లోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంకా చాలా మండలాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యాశాఖ అధికారులు సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలి.
– ఎంవీ మహంకాళేశ్వరరావు, అధ్యక్షుడు, వైఎస్సార్ టీఏ, కృష్ణాజిల్లా
కొరవడిన కసరత్తు..
విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు చేయకుండా, సరైన ప్రణాళిక లేకుండా బదిలీల ప్రక్రియను నిర్వహించడంతో అనేక సమస్యలు తలెత్తాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు అవగాహనా రాహిత్యంతో నిబంధనలు ఏర్పాటు చేసి బదిలీలు చేయాలని ఆదేశించటం వల్ల కూడా సమస్యలు తలెత్తాయని విద్యాశాఖ సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు.

గజిబిజి.. గందరగోళం!

గజిబిజి.. గందరగోళం!