
నిరంతర యోగాతో సత్ఫలితాలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతి ఒక్కరూ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సూచించారు. ఆదివారం విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో జరిగిన యోగాభ్యాసన కార్యక్రమం కలెక్టర్ పాల్గొన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్ తదితరులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం యోగా సాధన చేయాలన్నారు. యోగా సాధనను ఏ ఒక్క రోజుకో, నెలకో పరిమితం చేయకూడదన్నారు. నిత్యం జీవితంలో భాగం చేసుకొని సాధన చేయడం ద్వారా దాని ఫలితాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ఆయుష్ అధికారి డాక్టర్ రత్న ప్రియదర్శిని, యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు.
క్రీస్తు మార్గం అనుసరణీయం
గుణదల(విజయవాడ తూర్పు): సర్వమానవాళి రక్షణ ప్రణాళికలో భాగంగా ఏసుక్రీస్తు ఈ లోకానికి అరుదెంచారని, ఆయన అనుసరణీయమని గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజ్ అన్నారు. పుణ్యక్షేత్ర ప్రధానాలయంలో ఆదివారం ఉదయం సమష్టి దివ్య బలి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు ఈ లోకానికి వెలుగన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. అనుదిన ప్రార్థనతో పాటు భక్తి విశ్వాసాలను కొనసాగించాలని వివరించారు. దేవుడు బోధించిన ప్రేమ, జాలి, దయ వంటి సద్గుణాలను కలిగి ఉండాలని తెలిపారు. అనంతరం సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు.