
సత్తా చాటిన బాడీ బిల్డింగ్ క్రీడాకారులు
పెనమలూరు: రాష్ట్ర స్థాయిలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ చాటి పతకాలు సాధించారు. ఈ నెల 22వ తేదీన కావలిలో నిర్వహించిన సింహపురి మిస్టర్ ఆంధ్ర రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీల్లో స్పోర్ట్స్ ఫిజిక్లో ఎం.దినేష్ బంగారు పతకం గెలిచాడు. బాడీ బిల్డింగ్ 55 కేజీల విభాగంలో వి.సూర్యదేవరవరప్రసాద్, కాంస్య పతకం, 85 కేజీల విభాగంలో ఏ.నాగ అభినవ్ కాంస్య పతకం సాధించారు. క్రీడాకారులను కానూరు అశోక్ జిమ్లో ఆదివారం అభినందించి మెమెంటోలు అందజేశారు. జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్, కార్యదర్శి తాల్లూరి అశోక్, కోచ్ అల్లూరిరెడ్డి, ఎమ్మెల్యే బోడెప్రసాద్, డాక్టర్ వెలినేని పవన్, యువజన సర్వీసుల శాఖ అధికారి రఘురామ్ తదితరుల అభినందించారు.
ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేయండి: డీఈవో
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలను విక్రయిస్తున్న విద్యాసంస్థల్లో తనిఖీలు చేసి నివేదికలు సమర్పించాలని ఎన్టీఆర్ జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు అధికారులను ఆదేశించారు. ‘సాక్షి’ దినపత్రికలో ఇటీవల ప్రచురితమైన ‘ప్రైవేటు’ దోపిడి కథనానికి డీఈవో స్పందించారు. అలాగే వివిధ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు రావటంతో ఆయన మండల విద్యాశాఖాధికారులు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు వారి పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలను తక్షణమే తనిఖీలు నిర్వహించి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ను అధిక ధరలకు విక్రయించటం, అధిక ఫీజుల వసూలు చేసిన వారి పాఠశాలల గుర్తింపు రద్దు చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ముగిసిన నాట్య
ప్రాక్టికల్ పరీక్షలు
కూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళా పీఠంలో మూడు రోజులుగా జరుగుతున్న సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. పరీక్షలకు 21 మంది విద్యార్థులు హాజరయ్యారని పరీక్షలకు అధికారిగా వ్యవహరించిన సుధీర్రావు తెలిపారు. కళా పీఠం వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చింతా రవి బాల కృష్ణ నట్టువాంగంతో, టీచింగ్ అసిస్టెంట్ పసుమర్తి హరినాథ శాస్త్రి మృదంగంపై సహకరించారు.
ఫొటోగ్రఫీలో జిల్లాస్థాయి పోటీలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 19న ఫొటోగ్రఫీలో విశేష ప్రతిభ కనబరిచిన ఫొటోగ్రాఫర్లకు జిల్లా స్థాయిలో పురస్కారాలు ప్రదానం చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఫొటో జర్నలిస్టులు, ఫొటో గ్రాఫర్లు పోటీలలో పాల్గొనవచ్చన్నారు. జూలై 31వ తేదీలోగా తమ ఎంట్రీలు పంపాల్సి ఉంటుందని తెలిపారు. మూడు విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నామని.. మొదటి విభాగంలో జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, స్వచ్ఛాంధ్ర/స్వచ్ఛ ఎన్టీఆర్, యోగాంధ్ర అంశాలకు సంబంధించి ఫొటో ఎంట్రీలు పంపొచ్చన్నారు. రెండో విభాగంలో తల్లికి వందనం/విద్య, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, దీపం – 2 ఉన్నాయని, మూడో విభాగంలో అత్యుత్తమ న్యూస్ ఫొటో పోటీ ఉంటుందన్నారు. ప్రతి విభాగంలో ప్రథమ (రూ. 10 వేలు), ద్వితీయ (రూ. 7వేలు), తృతీయ (రూ. 4 వేలు) బహుమతులతో పాటు రూ. 2 వేలు చొప్పున ఆరుగురికి ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్లు వివరించారు. ఒరిజినల్ ఫొటో ఎంట్రీలను డీపీఆర్వో కార్యాలయం, స్టేట్ గెస్ట్ హౌస్, విజయవాడ–520002 చిరునామాకు నేరుగా లేదా పోస్టల్ ద్వారా సమర్పించవచ్చని, ఇతర వివరాలకు 9121215373లో సంప్రదించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.

సత్తా చాటిన బాడీ బిల్డింగ్ క్రీడాకారులు