
మేమింతే.. మారమంతే!
వక్ఫ్ భూములపై మళ్లీ వాలిన ‘పచ్చ’గద్దలు!
పెనమలూరు: తాడిగడప, పెదపులిపాక గ్రామాల్లో ఉన్న కొండపల్లి ఖాజీ వక్ఫ్ భూములను పచ్చగద్దలు ఆక్రమించే పనిలో ఉన్నాయి. ఈ భూములకు గత కొద్ది రోజుల క్రితం హైకోర్టు ఆదేశాల మేరకు తహసీల్దార్ గోపాలకృష్ణ బహిరంగ కౌలు వేలం నిర్వహించారు. వక్ఫ్ అధికారులు భూముల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టారు. అయితే అత్యంత విలువైన వక్ఫ్ భూములు ఆక్రమించటానికి కొంతమంది రంగంలోకి దిగారు. దీనిపై కొండపల్లి ఖాజీ సర్వీస్ ఇమామ్ ఎస్హెచ్ హుస్సేనీ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగిందంటే..
తాడిగడప, పెదపులిపాక గ్రామాలలో వక్ఫ్ భూములు దాదాపు 40 ఎకరాలకు పైగానే ఉన్నాయి. ఈ భూములు చాలా ఏళ్లుగా కొంత మంది ‘పచ్చ’నేతలు ఆక్రమించి నయాపైసా కౌలు చెల్లించకుండా సాగు చేశారు. దీనిపై ‘సాక్షి’ దిన పత్రికలో కథనాలు రావటం, వక్ఫ్ అధికారులు స్పందించటంతో ఎట్టకేలకు హైకోర్టు ఆదేశాలతో కౌలు బహిరంగ వేలం తహసీల్దార్ గోపాలకృష్ణ సమక్షంలో ఇటీవల నిర్వహించారు. కౌలు వేలంలో పలువురు రైతులు పాల్గొని రూ.25 లక్షలకు కౌలువేలం పాడారు. ఇక కోర్టు అనుమతులతో కౌలు పాట పాడిన వారు వక్ఫ్ భూములు సాగు చేయాల్సి ఉంది.
అదును చూసి.. చొరబడి..
కొంతమంది కోర్టు ఉత్వర్వులకు వ్యతిరేకంగా, తహసీల్దార్ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ వక్ఫ్ భూముల్లోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించి భూములు దున్నారని కొండపల్లి ఖాజీ సర్వీస్ ఇమామ్ ఎస్హెచ్ హుస్సేనీ పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోడవరానికి చెందిన టి.శ్రీనివాసరావుతో పాటు మరో నలుగురు వ్యక్తులు చట్ట విరుద్ధంగా వక్ఫ్ భూముల్లోకి ప్రవేశించి భూములు దున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇమామ్ ఎస్హెచ్ హుస్సేనీ కోరారు. ఈ ఆక్రమణలపై ఇక పోలీసులు చిత్తశుద్ధితో ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
కౌలు వేలం నిర్వహించినా ఆగని వైనం పోలీసులకు ఫిర్యాదు