
ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి
మచిలీపట్నం అర్బన్: సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) బదిలీలను మాన్యువల్ కౌన్సెలింగ్ విధానంలోనే చేస్తామని ఉపాధ్యాయ సంఘాల సమక్షంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. మచిలీపట్నంలోని ఉమ్మడి కృష్ణా జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ఆదివారం ఉపాధ్యాయులు ముట్టడించారు. ప్రభుత్వం హామీలను తుంగలో తొక్కిందని ఆరోపిస్తూ కార్యాలయం గేట్లను తోసుకుంటూ లోపలకు ప్రవేశించారు. డీఈవో కార్యాలయానికి భారీగా చేరిన పోలీసులు ఉపాధ్యాయులను నిలువరించే ప్రయత్నం చేశారు.
ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
కూటమి ప్రభుత్వం తీరుపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెబ్ కౌన్సె లింగ్ వద్దు, మాన్యువల్ కౌన్సెలింగ్ ముద్దు నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. అనంతరం డీఈఓను ఘెరావ్ చేశారు. ఈ సందర్భంగా ఐక్య వేదికకు చెందిన పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న వెబ్ కౌన్సెలింగ్ నిర్ణయం ఉపాధ్యాయులను ఆవేదనకు గురిచేస్తున్నారు. ఎస్జీటీలకు వెబ్ కౌన్సెలింగ్ విధానంలో బదిలీలు నిర్వహించాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంత వరకు ఉద్యమిస్తామన్నారు. ప్రభుత్వం లీప్ యాప్లో వెబ్ కౌన్సెలింగ్ మోడల్ వీడియోను విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సాంకేతిక తప్పిదాలతో నష్ట పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని లేనిపక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో ఎస్టీయూ, పీఆర్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఏపీయూఎస్, వైఎస్సార్ ఆర్టీఏఫ్, ఎస్టీఎఫ్, పీఈటీ అసోసియేషన్, ఎస్ఆర్టీఎఫ్, ఎన్టీఏ, ఎస్సీఎస్టీ యూనియన్ తదితర సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేయకపోతే ఉద్యమమే టీచర్ల సంఘాల హెచ్చరిక డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించిన ఉపాధ్యాయులు కార్యాలయం గేట్లు తోసుకుని లోపలికి ప్రవేశం లీప్ యాప్లో వీడియోపై తీవ్ర వ్యతిరేకత

ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి