
ముగిసిన స్పేస్ 2025 సదస్సు
గన్నవరం రూరల్: చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగిన కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్(సీఎంఈ) కార్యక్రమం ఆదివారం ముగిసింది. స్పేస్ 2025 పేరిట నిర్వహించిన సదస్సుకు కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై బేసిక్ మోనిట రింగ్, ఎక్విప్మెంట్పై వైద్య విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ఆపరేషన్ సమయంలో రోగి నొప్పి అనుభవించకుండా ఉపయోగించే ముఖ్యమైన విధానాలు అవగాహన చేసుకోవాలన్నారు. ఆపరేషన్ థియేటర్లో అల్ట్రా సౌండ్ మిషన్, ఆక్సిజన్ సిలిండర్, సక్షన్ యంత్రం, వెంటిలేటర్ పరిశీలించాలన్నారు. డిపార్టుమెంట్ ఆఫ్ అనస్తీషీయాలజీ, క్రిటికల్ కేర్ సంయుక్త విభాగంలో జరిగిన సదస్సులో నిపుణులు పాల్గొని విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ మేజర్ ఎంవీ భీమేశ్వర్, అనస్తీషీయా హెచ్వోడీ డాక్టర్ సూర్యశ్రీ, డాక్టర్ వరప్రసాద్, డాక్టర్ గోవర్థిని, డాక్టర్ సుధాకర్, పీజీ, యూజీ విద్యార్థులు 200 మంది పాల్గొన్నారు. తొలుత డైరెక్టర్ జనరల్ డాక్టర్ నాగేశ్వరరావు, అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి, బ్రోచర్లు ఆవిష్కరించారు.