బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆలిండియా అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ చల్లప్ప
కృష్ణలంక(విజయవాడతూర్పు): కేంద్రం ప్రభుత్వం ప్రైవేట్ టెలికం కంపెనీలకు ఇస్తున్న రాయితీలను బీఎస్ఎన్ఎల్కు కూడా వర్తింపజేయాలని, 4జీ, 5జీ సౌకర్యం కల్పించాలని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆలిండియా అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎస్.చల్లప్ప డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గవర్నర్పేటలోని బాలోత్సవ్ భవన్లో బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సర్కిల్ ప్రెసిడెంట్ సాగర్ అధ్యక్షతన శనివారం జరిగింది. ముఖ్య అతిథి చల్లప్ప మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 2017 జనవరి ఒకటో తేదీ నుంచి సర్వీస్లో ఉన్న ఉద్యోగులకు వేతన సవరణ, ఉద్యోగ విరమణ చేసిన వారికి పింఛన్ సవరణ జరగక పోవటానికి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలే కారణమన్నారు. భవిషత్లో వేతన సవరణ జరిగితే కొత్త పింఛన్దారులు మాత్రమే లబ్ధి పొందుతారని, పాత పింఛన్దారులకు ఆర్థిక ప్రయోజనాలు వర్తించవని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లుతో పాటు పింఛన్ సవరణ బిల్లును ఆమోదించిందని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ వల్ల కార్మికుల హక్కులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. సీఐటీయూ స్టేట్ ప్రెసిడెంట్ కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలపాలని కోరారు. కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ ఈయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కృష్ణబాలాజీ, సహాయ కార్యదర్శి పి.తాతారావు, జిల్లా కార్యదర్శి పి.రవికుమార్, ఏఐబీడీపీఏ వైస్ ప్రెసిడెంట్ పి.అశోక్బాబు, సర్కిల్ కార్యదర్శి ఎన్.రామారావు, గౌరవ సలహాదారుడు కె.ఎస్.సి.బోస్ తదతరులు పాల్గొన్నారు.