
పురోగతి లేకుంటే ఉపేక్షించం
చిలకలపూడి(మచిలీపట్నం): గృహ నిర్మాణాల్లో పురోగతి లేకుంటే ఉపేక్షించేది లేదని, బాధ్యులైన వారిని సస్పెండ్ చేస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను హెచ్చరించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని మీకోసం సమావేశం మందిరంలో గృహ నిర్మాణ పురోగతిపై మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, గృహ నిర్మాణ సంస్థ ఇంజినీర్లతో సమావేశం నిర్వహించి మండలాల వారీగా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణం చాలా వెనుకబడి ఉందన్నారు. ఈ నెల 13న సమీక్షించినప్పుడు 910 గృహాలను లక్ష్యంగా నిర్ణయించగా.. కేవలం 412 గృహాలు మాత్రమే పూర్తి చేశారన్నారు. మచిలీపట్నం నగరం, అవనిగడ్డ, కోడూరు, గన్నవరం, చల్లపల్లి, పెదపారుపూడి, కృత్తివెన్ను, మోపిదేవి, గుడివాడ నాగాయలంక మండలాలు పురోగతిలో చాలా వెనుకబడ్డాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో లెంటల్ స్థాయిలో 8,108, పైకప్పు స్థాయిలో 2,148, రూఫ్ కాస్టింగ్ స్థాయిలో 588 ఇళ్లు ఉన్నాయన్నారు. జూన్ నెల 13వ తేదీన నిర్వహించే సమావేశానికి పనితీరు మార్చుకోకపోతే కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు బాధ్యులైన వారిని అందర్నీ సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. గృహ నిర్మాణంపై మండల ప్రత్యేక అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి సంబంధిత ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లతో పాటు వెల్ఫేర్ సెక్రటరీ, గృహ నిర్మాణ సంస్థ ఇంజినీర్లతో తరచూ సమావేశాలు నిర్వహించి లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.
నేడు పింఛన్ల పంపిణీ..
జూన్ ఒకటో తేదీన సెలవు కావటంతో ఈనెల 31వ తేదీ శనివారం పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు సజావుగా చేయాలని కలెక్టర్ ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారి వెంకట్రావు, టిడ్కో ప్రాజెక్టు డైరెక్టర్ చిన్నోడు, మచిలీపట్నం, పెడన, ఉయ్యూరు మునిసిపల్ కమిషనర్లు బాపిరాజు, గోపాలరావు, వెంకటేశ్వరరావు, మండల ప్రత్యేక అధికారులు జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆనంద కుమార్, డీటీడబ్ల్యూవో ఫణిధూర్జటి, మత్స్యశాఖ జేడీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
గృహ నిర్మాణాల్లో చాలా మండలాలు వెనుకబడి ఉన్నాయి అధికారులతో కృష్ణా కలెక్టర్ సమీక్ష