
కుటుంబాలు కుదేలు!
సంక్షేమ వెలుగులు లేక సంక్షోభ చీకట్లు
పెడన: ప్రస్తుతం కూటమి సర్కారు ఏడాది పాలనలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు రిక్తహస్తమే మిగిలింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్సిక్స్ అంతా ప్రచార ఆర్భాటమేనని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఖజానా ఖాళీగా ఉందని, నిధులు లేవని, అప్పులు చేస్తున్నామని దాటవేస్తూ కూటమి నేతలు చెబుతున్న మాటలకు విసుగెత్తిపోతున్నారు. ఇప్పటి వరకూ తల్లికి వందనం కింద రూ.15 వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు, 18 ఏళ్లు నిండిన మహిళలు నెలకు రూ.15 వేలు చొప్పున ఒక్కొక్కరూ ఆర్థికంగా చాలా నష్టపోయారు. మహిళలు ఉచిత బస్సు కనీసం కంటికి కనిపించక ఇదెక్కడి ప్రచారం తల్లో అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఏడాదిలో సాగుకు అవసరమైన పెట్టుబడులు, విద్యార్థులు చదువులు పూర్తి చేయటానికి అందినకాడికి అప్పులు తెచ్చి కట్టుకోవాల్సి వచ్చిందంటూ వాపోతున్నారు. నేతన్నలకు విద్యుత్ బిల్లుల చెల్లింపుల్లో 200 యూనిట్ల వరకు ఉచితమని చెప్పి నెలలు గడుస్తున్నా విధి విధానాలు ఏమీ విడుదల చేయకపోవడంతో నేతన్నలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. పూట గడవటమే కష్టం అవుతున్న పరిస్థితుల్లో విద్యుత్ భారంతో మగ్గాలు కదలటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ట్రూ అప్, సర్వీసు చార్జీలు పేరుతో విద్యుత్ చార్జీలు పెంచి ఎన్డీయే కూటమి సర్కారు పేద, మధ్యతరగతి వర్గాల నడ్డి విరుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
స్వయం ఉపాధిపై ఆధారపడి జీవించే కుటుంబాలకు ఆదరణ కరువైంది. మరీ ముఖ్యంగా రోడ్ల వెంబడి దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవించే వాళ్లు, చిరు వ్యాపారులు, ఆటో వాలాలు కూటమి తీరుతో బతుకు భారంగా ఈడుస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా ఆయా వర్గాలకు వ్యాపార వృద్ధికి, వాహనాల మరమ్మతులకు అవసరమైన సొమ్మును రూ.10 వేలు ఆపైన నేరుగా వారి బ్యాంకు ఖాతాకే చేరేలా చేసింది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. వివిధ కార్పొరేషన్ల కింద ఇచ్చే రుణాల యూనిట్ల కేటాయింపు అంతా ‘పచ్చ’పక్షంగా సాగుతోంది. ప్రతి నియోజకవర్గంలో వేలల్లో అర్జీలు వస్తే కేవలం 200 యూనిట్లు కూడా మించకుండా కేటాయింపులు చేసి మొక్కుబడిగా చేతులు దులుపుకున్నారు. ఇందులో కూడా కేవలం ఎమ్మెల్యేల సిఫారసులు ఉన్న టీడీపీ వర్గీయులకే రుణాలు మంజూరయ్యేలా చేశారు. దీంతో కోటి ఆశలతో వ్యాపారాలు చేసుకుని స్వయం ఉపాధి ద్వారా కుటుంబాన్ని ఆర్థికంగా వృద్ధి చేసుకుందామని ఆశించిన ఎందరో నిరుద్యోగులు, చిరు వ్యాపారులకు నిరాశ మిగిలింది. బీసీ కార్పొరేషన్ల ద్వారా పేద మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఉచితంగా అందజేస్తామని చెప్పి చివరకు రిక్తహస్తమే చూపారు.
దగా పడ్డ పేద, మధ్య తరగతి వర్గాలు
‘పచ్చ’పాతం.. వెన్నుపోటు..