‘హెల్త్‌ సెక్రటరీపై దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం’ | - | Sakshi
Sakshi News home page

‘హెల్త్‌ సెక్రటరీపై దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం’

May 3 2025 8:35 AM | Updated on May 3 2025 8:35 AM

‘హెల్త్‌ సెక్రటరీపై దౌర్జన్యాన్ని  ఖండిస్తున్నాం’

‘హెల్త్‌ సెక్రటరీపై దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం’

– ఏపీహంస కృష్ణాజిల్లా శాఖ

లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలో వార్డు సచివాలయంలో పనిచేస్తున్న హెల్త్‌ సెక్రటరీపై జరిగిన దౌర్జన్యాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌(ఏపీహంస) కృష్ణాజిల్లా శాఖ అధ్యక్షుడు వినుకొల్లు రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ సింగ్‌నగర్‌లో హెల్త్‌ సెక్రటరీగా ఓ మహిళ విధులు నిర్వహిస్తున్నారు. ఎన్‌సీడీసీడీ సర్వేలో భాగంగా తమ ఇంటికి వచ్చిన ఆమైపె ఆ ఇంటివారు అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనలో బాధిత ఉద్యోగినికి తమ అసోసియేషన్‌ అండగా నిలుస్తోందని, అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రామకృష్ణ తెలిపారు. ఈ విషయాన్ని వైద్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారు ప్రధానమంత్రి టూర్‌ ప్రోగ్రామ్‌లో ప్రొటోకాల్‌ డ్యూటీ ఉన్నారని, ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. విధుల్లో ఉన్న వైద్య ఉద్యోగులకు అంతరాయం కలిగించినా, బెదిరింపులకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు తమ అసోసియేషన్‌ అండగా ఉంటుందని రామకృష్ణ పేర్కొన్నారు.

ఎయిర్‌పోర్ట్‌లో తొలిసారి బోయింగ్‌ 777 ల్యాండింగ్‌

విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)లో మొట్టమొదటి సారిగా అత్యంత పొడవైన భారీ బోయింగ్‌ 777–300 ఈఆర్‌ విమానం శుక్రవారం ల్యాండ్‌ అయ్యింది. ఈ విమానంలోనే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడికి చేరుకున్నారు. ప్రపంచంలోనే లాంగ్‌ రేంజ్‌ వైడ్‌ బాడీ విమానాల్లో బోయింగ్‌ 777–300 ఈఆర్‌ ఒకటి. సుమారు 392 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన అతి పెద్ద ట్విన్‌జెట్‌ ఇంజిన్‌తో కూడిన ఈ విమానం ఏకదాటిగా 7,370 నాటికల్‌ మైళ్లు(13,649 కిలో మీటర్లు) దూరం ప్రయాణించగలదు. ఈ విమానం 73.9 మీటర్లు పొడవు, 18.5 మీటర్లు ఎత్తు, 64.8 మీటర్లు రెక్కల పొడవు ఉంటుంది. దేశంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ప్రయాణ అవసరాల నిమిత్తం రెండు బోయింగ్‌ 777 విమానాలను ప్రత్యేకంగా రూపొందించారు. ఈ విమానాల్లో రక్షణపరంగా అత్యాధునికమైన భద్రత ప్రమాణాలు కలిగి ఉంటాయి. తొలిసారి ఇక్కడి విమానాశ్రయానికి చేరుకున్న అతిపెద్ద బోయింగ్‌ విమానాన్ని చూసేందుకు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు, ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది ఆసక్తి చూపించారు.

అమరావతి సభకు వెళ్లి వస్తూ ప్రమాదం

పెనమలూరు: అమరావతి సభకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తూ వ్యక్తి ప్రమాదానికి గురవటంతో కాలు విరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. పెదపారుపూడి మండలం ఎలమర్రు గ్రామానికి చెందిన దగాని లాజర్‌(54)ను టీడీపీ నేతలు అమరావతి సభకు బస్సులో తీసుకు వెళ్లారు. సభ ముగిసిన తరువాత టీడీపీ కార్యకర్తలు బస్సులో బయలుదేరారు. పెనమలూరు సెంటర్‌ ఆలపాటి గార్డెన్స్‌లో భోజనం చేయటానికి బస్సు ఆపారు. బస్సు దిగిన లాజర్‌ రోడ్డు పక్కన నిలబడ్డాడు. అయితే కంకిపాడు వైపు వెళ్తున్న బైక్‌ అతనిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతని కాలు విరిగింది. 108 వాహనంలో అతనిని చికిత్సకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement