
విజయవాడ రైల్వేస్టేషన్లో తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ శుక్రవారం విజయవాడ డివిజన్లో పర్యటించారు. డీఆర్ఎం నరేంద్ర ఎ. పాటిల్, పలు బ్రాంచ్ల సీనియర్ అధికారులతో కలసి జీఎం ముందుగా విజయవాడ స్టేషన్ ఆరో నంబర్ ప్లాట్ఫాం నుంచి తనిఖీలు ప్రారంభించారు. స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యాలు, భద్రత చర్యలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, తాగునీటి లభ్యతను పరిశీలించారు. అక్కడ నుంచి క్రూ లాబీని తనిఖీ చేసి లోకోపైలట్లతో మాట్లాడారు. రోజువారి విధుల్లో వారికి ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో విజయవాడ స్టేషన్ చేరుకున్న రైలు నెంబర్ 22851 సత్రగచ్చి–మంగళూరు రైలులో జీఎం తనిఖీలు నిర్వహించారు. వేసవిలో ప్రయాణికులకు తాగునీరు, మజ్జిగ పంపిణీని పరిశీలించి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను ప్రశంసించారు.
గుణదల స్టేషన్ అభివృద్ధి పనులపై సమీక్ష..
విజయవాడ నుంచి జీఎం అరుణ్కుమార్ జైన్ ఎస్పీఏసీ (సెల్ఫ్ ప్రొపెల్డ్ ఇన్స్పెక్షన్ కార్)లో రియర్ విండో ద్వారా భద్రత అంశాలను తనిఖీ చేస్తూ గుణదల రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ అమృత భారత్ స్టేషన్ పథకంలో రూ.24.37 కోట్లతో గుణదల రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు.