
వివాహితపై కత్తితో దాడి.. మృతి
నందిగామటౌన్: నందిగామలో వివాహితపై ఓ వ్యక్తి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. మండలంలోని రాఘవాపురం గ్రామానికి చెందిన మల్లెల దుర్గా స్రవంతి(37) కొంతకాలంగా పట్టణంలోని రైతుపేట ఎన్ఎస్పీ కాల్వ కట్ట వద్ద కుమారుడితో కలిసి అద్దె ఇంటిలో నివాసముంటుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు కుమారుడు ఆశిష్తో కలిసి కోదాడ వెళ్లిన ఆమె గురువారం రాత్రి తిరిగి ఇంటికి వచ్చింది. తల్లిని ఇంటి వద్దనే దింపి ఆశిష్ బయటకు వెళ్లాడు. అదే సమయంలో ఆమెకు తెలిసిన పట్టణానికి చెందిన అచ్చి పెద్దబాబు ఇంటి వద్దకు వచ్చి మహిళతో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆమె వెంటనే కుమారునికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది.
20 కత్తిపోట్లు..
ఇంతలో పెద్దబాబు ఆమెను ఇంటిలో నుంచి బయటకు తీసుకువచ్చి విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తల్లి ఫోన్ చేయటంతో ఇంటికి వచ్చిన కుమారుడు ఆమె వద్దకు వెళ్లేందుకు యత్నించగా కత్తి చూపించి బెదిరించి నిందితుడు అక్కడి నుంచి కారులో పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె శరీరంపై 20 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు ఎస్ఐ అభిమన్యు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. హత్యకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.